ఈశాన్యం.. అగ్నిగుండం: మొబైల్, ఇంటర్నెట్ బంద్..కర్ఫ్యూ: బస్సుల దగ్ధం: పొరుగు జిల్లాల్లో హింస..!
గువాహతి: పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఆందోళనకారులు ఆస్తుల విధ్వంసానికి దిగుతున్నారు. పరిస్థితి చేయి దాటుతున్నట్లు కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆందోళనకారులను అదుపు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కర్ఫ్యూను విధించింది. అస్సాం రాజధాని సహా డజనుకు పైగా జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసింది.

పొరుగు జిల్లాలకు పాకిన హింసాత్మక పరిస్థితులు..
ఒకవంక పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ కొనసాగుతుండగా.. మరో వంక- ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేకించి- త్రిపుర, అస్సాంలల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలను కొనసాగుతున్నాయి. లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా చెలరేగిన హింసాత్మక పరిస్థితులు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. లోక్ సభలో బిల్లు ఆమోదం పొందడం.. తాజాగా రాజ్యసభ సమక్షానికి రావడంతో అస్సామీలు తమ నిరసను తీవ్రతరం చేశారు.

డిస్పూర్ లో ఆస్తుల ధ్వంసం..
డిస్పూర్ లో ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. గుంపులు గుంపులుగా వచ్చిన ఆందోళనకారులు డిస్పూర్ లోని జనతా భవన్ వద్ద ఓ బస్సును తగులబెట్టారు. డీజిల్ ట్యాంకును పగులగొట్టి.. నిప్పు అంటించారు. కొన్ని ప్రభుత్వ భవనాలపై రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. డిస్పూర్, గువాహతిల్లో కర్ఫ్యూ విధించింది. 24 గంటల పాటు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించింది.

పొరుగు జిల్లాలకు పాకిన హింస..
గువాహతి, డిస్పూర్ లల్లో చెలరేగిన హింస.. క్రమంగా పొరుగు జిల్లాలకు సైతం వ్యాపించాయి. ఈ పరిస్థితిని ముందుగానే పసిగట్టిన ఆ రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. అల్లర్లు వ్యాపించకుండా ఉండటానికి మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. లఖీంపూర్, తిన్ సుకియా, ధిమాజీ, దిబ్రూగఢ్, చరాయ్ దియో, శివసాగర్, జోర్హాట్, గోలాఘాట్, కామపూర్ (మెట్రో), కామపూర్ జిల్లా వ్యాప్తంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసింది.

వేల సంఖ్యలో పారామిలటరీ బలగాలు..
అస్సాం, త్రిపురల్లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితులను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయిదువేలమందికి పైగా పారామిలటరీ బలగాలను ఆయా రాష్ట్రాలకు తరలించింది. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరింపజేసింది. కర్ఫ్యూ విధించిన తరువాత కూడా పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించినట్లు చెబుతున్నారు. గువాహతిలో ప్రధాన మార్గాలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.












Click it and Unblock the Notifications