జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితి: హై అలర్ట్
శ్రీనగర్: కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వేర్పాటు వాదులు సోమవారం బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ముందు జాగ్రత చర్యగా పోలీసులు అనేక మంది వేర్పాటు వాదులను గృహనిర్బంధం చేశారు.
గోవధ చేశాడనే కారణంతో అనంత్ నాగ్ కు చెందిన ట్రక్కు నిర్వహకుడు జహీద్ మీద ఈనెల 9వ తేదిన పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఆ సందర్బంలో జహీద్ తో పాటు ట్రక్కు డ్రైవర్ షౌకత్ అహమ్మద్ కు తీవ్రగాయాలైనాయి.
చికిత్స విఫలమై ఆదివారం సాయంత్రం జహీద్ మరణించాడు. ఈ నేపథ్యంలో వేర్పాటు వాదులు బంద్ కు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి విషమించడంతో కాశ్మీర్ లోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించారు.
అనంత్ నాగ్, శ్రీనగర్ ప్రాంతాలలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. పలు ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. విషయం తెలుసుకున్న సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మకాం వేశారు.
ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైన్యం రంగంలోకి దిగింది. పుకార్లు వ్యాపించకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వేర్పాటు వాదులు నివాసం ఉంటున్న ప్రాంతాలలో అదనపు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారు.