రాహుల్ గాంధీ.. యునానిమస్: వాయనాడా? రాయ్బరేలీనా?
Rahul Gandhi: దేశ రాజధానిలో ఏర్పాటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్షించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్కు అతి సమీపంలో నిలిచిపోయిన నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించింది.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున ఖర్గే, మాజీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రులు వీరప్ప మొయిలీ, భూపేష్ బఘేల్, అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత రాజీవ్ శుక్లా.. పలువురు సీడబ్ల్యూసీ సభ్యులు ఇందులో పాల్గన్నారు.

లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎంపిక చేసింది. ఆయన ఈ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుందని నేతలు తీర్మానించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించారు. మరో నాయకుడి పేరు ఈ సమావేశంలో చర్చకు రాలేదు. ప్రతిపక్ష నేత బాధ్యతలను రాహుల్ గాంధీ సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది.
సమావేశం ముగిసిన అనంతరం పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేష్ విలేకరులతో మాట్లాడారు. 10 సంవత్సరాల కాలంలో రాహుల్ గాంధీ అవిశ్రాంతంగా మోదీ నియంతృత్వ ప్రభుత్వంపై పోరాడారని అన్నారు. భారత్ జోడో, భారత్ న్యాయ్ యాత్రలతో దేశాన్ని ఏకం చేశారని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ చేసిన పోరాటాల ఫలితంగా- ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాకు 234 స్థానాలు లభించాయని అన్నారు. ఈ అయిదు సంవత్సరాలు కూడా మోదీ ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని, అటు పార్లమెంట్ లోపల, బయటా నియంతృత్వ వైఖరిని ఎండగడుతామని తేల్చి చెప్పారు.
మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానమంత్రులను ఆహ్వానించారని, తమకు ఇప్పటివరకూ పిలుపు అందలేదని జైరామ్ రమేష్ అన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా? అనేది తాము నిర్ణయం తీసుకుంటామని వివరించారు. రాయ్బరేలీ, వాయనాడ్ నుంచి లోక్సభకు ఎన్నికైన రాహుల్ గాంధీ.. ఏ స్థానానికి రాజీనామా చేస్తారనేది త్వరలో వెల్లడిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications