షాకింగ్ : ట్రూకాలర్ డేటా చోరీ.. 4.75కోట్ల యూజర్స్ డేటా హ్యాక్..?
స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత రకరకాల యాప్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క క్లిక్తో గేమ్స్,వీడియో కాన్ఫరెన్స్,చాటింగ్స్,మూవీస్, ఇలా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే చాలావరకూ సోషల్ యాప్స్ కూడా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని యాప్స్ నుంచి యూజర్స్ డేటా చోరీ అవుతుండటం ఆందోళన కలిగించే అంశం. గ్లోబలైజేషన్ నేపథ్యంలో డేటా కూడా పెద్ద మార్కెట్గా అవతరించడంతో... అడ్డదారుల్లో డేటాను చోరీ చేసి అమ్మే సైబర్ నేరగాళ్లు కూడా పుట్టుకొస్తున్నారు.
తాజాగా ట్రూకాలర్ డేటా పేరిట ఓ సైబర్ నేరగాడు 4.75కోట్ల మంది భారతీయుల డేటాను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన ఆన్లైన్ ఇంటలిజెన్స్ సంస్థ సైబిల్ గుర్తించింది. ఇందులో స్త్రీ,పురుషుల పేర్లు,వారి ఫోన్ నంబర్స్,వారి లొకేషన్,మొబైల్ నెట్వర్క్,ఫేస్ బుక్ ఐడీ,మెయిల్ తదితర వివరాలు ఉన్నట్టు గుర్తించారు. 2019 నుంచి యూజర్ డేటాను అతను చోరీ చేసినట్టు గుర్తించారు.
అయితే డేటా చోరీపై ట్రూకాలర్ యాజమాన్యం వాదన భిన్నంగా ఉంది. అది అధికారిక డేటా కాదని,యూజర్స్ డేటా బేస్ తమవద్ద భద్రంగా ఉందని స్పష్టం చేసింది. ఎవరో వేరే మార్గాల ద్వారా కొంతమంది ఫోన్ నంబర్స్,వివరాలు సేకరించి ఆన్లైన్లో అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారేమోనని చెప్పింది.
Recommended Video
కాగా,పలు యాప్స్ నుంచి ఇలా డేటా చోరీ జరిగిందన్న కథనాలు గతంలోనూ వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 50 లక్షల మంది భారతీయుల క్రెడిట్,డెబిట్ కార్డుల డేటా హ్యాకర్ల చేతికి వెళ్లినట్టు కథనాలు వచ్చాయి. ఓ డార్క్ వెబ్ సైట్ సీక్రెట్గా ఈ డేటాను సేకరించి ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది. ఒక్కో డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డును రూ.5వేలు/రూ.10వేలు చొప్పున అమ్మేసింది.