బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ‘ఆసని’ హెచ్చరికలు: కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్
న్యూఢిల్లీ: దేశంలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ముంచుకొస్తుందన్న భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కేంద్ర విపత్తు నిర్వహణశాఖ అప్రమత్తమైంది. శ్రీలంక నుంచి అండమాన్ నికోబర్ దీవుల వైపు తుఫాను దూసుకొస్తున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
2022లో మొదటి తుఫానుగా చెప్పబడుతున్న ఈ తుఫానుకు "సైక్లోన్ అసని"గా నామకరణం చేశారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తూర్పు తీరప్రాంతంలో విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. తుఫాను దృష్ట్యా అండమాన్ - నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతంలో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై విపత్తు నిర్వహణ, కేంద్ర బలగాలు, అధికారులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సమీక్షలు నిర్వహించారు.

తుఫాను కదలికలపై పూర్తి అప్రమత్తంగా ఉంటూ క్రమం తప్పకుండా సూచనలు చేయాలని అజయ్ భల్లా ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిపై అండమాన్ - నికోబార్ అడ్మినిస్ట్రేషన్ తో సంప్రదింపులు జరపాలని ఆయాశాఖల అధికారులకు సూచించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తూర్పు తీరంలో చేపలు పట్టడం, పర్యాటకం, షిప్పింగ్ కార్యకలాపాలు ప్రస్తుతం నిలిపివేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని అధికారులు ఆదేశించారు. అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (ఆర్మీ), ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ లు స్టాండ్ బైలో ఉండాలని కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది.
కాగా, గత వారంలో అండమాన్ -నికోబార్ దీవుల వెంబడి దక్షిణ బంగాళఖాతంలోని మధ్య ప్రాంతంలో ఏర్పడిన స్వల్ప అల్పపీడనం మార్చి13 నాటికి గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా మారిందని భారత వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. మార్చి 20 నాటికి అల్పపీడనం ఉదృతమై మరుసటి రోజు తుఫానుగా మారుతుందని.. ఆ తర్వాత, ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి, మార్చి 23 ఉదయం నాటికి బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ తీరానికి చేరుకుంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఈ సమయంలో తీరం వెంబడి 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తీర ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications