తీరంలో భయోత్పాతం: విరుచుకుపడుతున్న అతి తీవ్ర తుఫాన్- స్కూళ్లు బంద్, రైళ్లు రద్దు
Cyclone Dana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంగా మరింత బలపడింది. వాయుగుండంగా మారింది. ఇది- వచ్చే 24 గంటల వ్యవధిలో క్రమంగా తుఫాన్గా ఆవిర్భవించనుంది. దీని ప్రభావం ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్పై తీవ్రంగా ఉండబోతోంది.
అతి తీవ్రం..
బంగాళాఖాతం తూర్పు- మధ్య ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ ఉత్తర తీరంంలో ఈ నెల 19వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇది తొలుత అల్పపీడనంగా, అనంతరం వాయుగుండంగా మారింది. వాతావరణ కేంద్రం వేసిన అంచనాల ప్రకారం- క్రమంగా అతి తీవ్ర తుఫాన్గా ఆవిర్భవిస్తుంది. దీనికి దానా అని ఇదివరకే పేరు పెట్టిన విషయం తెలిసిందే.

తుఫాన్ ట్రాకింగ్..
తూర్పు- మధ్య బంగాళాఖాతంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. మంగళవారం సాయంత్రం నాటికి ఒడిశాలోని పారాదీప్కు ఆగ్నేయ దిశగా 730, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 770, బంగ్లాదేశ్లోని ఖేపుపారాకు ఆగ్నేయ దిశగా 740 కిలో మీటర్ల దూరంలో ఉంది.
బాలాసోర్ వద్ద..
ఈ తుఫాన్ గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారు జామున ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలండ్ మధ్య తీరం దాటనుంది. బాలాసోర్ సమీపంలో గల ధర్మా పోర్ట్ వద్ద తీరాన్ని తాకుతుందనే అంచనాల ఉన్నాయి. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. వీటి తీవ్రత 140 నుంచి 160 కిలోమీటర్ల వరకూ పెరిగడానికీ అవకాశం ఉంది.
మూడు రాష్ట్రాలపై..
దీని ప్రభావం వల్ల బుధవారం నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ప్రత్యేకించి ఒడిశాలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే అక్కడ సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి.

197 రైళ్లు రద్దు..
తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేశారు. మొత్తంగా 197 రైళ్లు రద్దయ్యాయి. తుఫాన్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
సెలవులు..
కాగా- గంజాం, పూరీ, జగత్సింగ్ పూర్, కేంద్రాపారా, భద్రక్, బాలాసోర్, మయూర్భంజ్, కియొంఝర్, ఢెంకనాల్, జైపూర్, అంగుల్, ఖుర్దా, నయాగఢ్, కటక్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవును ప్రకటించింది ప్రభుత్వం. బుధవారం నుంచి మూడు రోజుల పాటు అంటే 25వ తేదీ వరకు సెలవు ఉంటుంది.
బెంగాల్పై..
ఇదే తరహా పరిస్థితులు పశ్చిమ బెంగాల్లోనూ నెలకొన్నాయి. కోల్కత, ఈస్ట్ మిడ్నాపూర్, వెస్ట్ మిడ్నాపూర్, దక్షిణ 24 పరగణా, ఉత్తర 24 పరగణా, ఝాగ్రమ్, బాంకురా, హూగ్లీ, హౌరా జిల్లాలపై దానా తుఫాన్ ప్రభావం అధికంగా ఉండబోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా జిల్లాల్లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు.
10 లక్షల మంది..
ఈ రెండు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావానికి గురయ్యే ప్రాంతలకు చేరుకున్నారు జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది. తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తోన్నారు. మొత్తం 10 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. వారి కోసం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశాయి.












Click it and Unblock the Notifications