జలఖడ్గం! ఫొని గుప్పిట్లో 17 జిల్లాలు: ఎన్నికల కోడ్ ఎత్తివేత
భువనేశ్వర్: ఫొని తుఫాను ఒడిశాను చివురుటాకులా వణికిస్తోంది. తీర ప్రాంత నగరం పూరీకి 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలోనే ఫొని తుఫాను ధాటికి ఒడిశా అల్లకల్లోలానికి గురైంది. ఇక తీరం దాటే సమయానికి దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికే భయపడుతున్నారు అక్కడి అధికారులు. తుఫాను తీరం దాటే సమయానికి- కనీసం 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులు వీస్తాయని అంచనా వేస్తోంది పాలనా యంత్రాంగం. 17 జిల్లాలపై ఫొని తుఫాను పెను ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు.
ఒడిశా వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా సమచారం ప్రకారం.. ఫొని తుఫాను పూరీ తీరానికి సుమారు 680 కిలోమీటర్ల దూరంలో నెలకొంది. పెను తుఫానుగా రూపు దాల్చింది. క్రమంగా అది- పూరీ వైపు కదులుతోంది. తీరం దాటేసమయానికి మరింత ప్రచండంగా రూపుదాల్చే అవకాాశాలు ఉన్నాయని ఒడిశా వాతావరణ శాఖ డైరెక్టర్ హెచ్ ఆర్ బిశ్వాస్ తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కనిష్ఠంగా 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

శుక్రవారానికి తీరం దాటే అవకాశం..
ఈ నెల 3వ తేదీన అంటే.. శుక్రవారం నాటికి ఫొని తుఫాను పూరీ వద్ద తీరాన్ని తాకవచ్చని ఒడిశా వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖతంలో పూరీ నగరానికి నైరుతి దిశలో 680 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్న ఈ తుఫాను క్రమంగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పూరీ వైపు కదులుతోందని డైరెక్టర్ హెచ్ ఆర్ బిశ్వాస్ తెలిపారు. పూరీ, జగత్ సింగ్ పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్, మయూర్ భంజ్, గజపతి, గంజాం, ఖుర్దా, కటక్, జైపూర్, కియోంఝర్, నయాగఢ్, రాయగడ, ఢెంకనాల్, అంగుల్, నవరంగ్ పూర్ జిల్లాలపై తుఫాను పెను ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆయా జిల్లాల పాలనాధికారులు, ప్రభుత్వానికి పూర్తి సమాచారం అందించామని చెప్పారు.

17 జిల్లాల్లో రెడ్ వార్నింగ్.. మరో నాలుగు జిల్లాల్లో ఎల్లో వార్నింగ్
తుఫాను ప్రభావానికి గురయ్యే 17 జిల్లాల్లో అధికారులు రెడ్ వార్నింగ్ ను జారీ చేశారు. దీనితో పాటు- బౌద్ధ్, కలహండి, సంబాల్ పూర్, దేవ్ గఢ్, సుందర్ గఢ్ జిల్లాల్లో ఎల్లో వార్నింగ్ ఇచ్చారు. దాదాపు అన్ని ఓడరేవుల్లో తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాద సంకేతాలను ఎగురవేశారు. 28 ట్రూపుల జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణ బలగాలను మోహరింపజేశారు.

ఎన్నికల కోడ్ ఎత్తివేత..
ఫొని తుఫాను తీవ్రతను నేపథ్యంలో..ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను చేపట్టడానికి వీలుగా ప్రస్తుతం అక్కడ అమలులో ఉన్న ఎన్నికల నిబంధనలను ఎత్తివేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఒడిశా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తుఫాను ప్రభావానికి గురయ్యే జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండదు. ఫలితంగా- తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రదేశాలకు తరలించడంతో పాటు- సహాయ, పునరావాస చర్యలు చేపట్టడానికి ఎలాంటి ఆటంకం ఉండదు.

విద్యాసంస్థలకు సెలవు..
తుఫాను ప్రభావానికి గురయ్యే జిల్లాల్లో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. తీర ప్రాంతాలను ఖాళీ చేయించింది. పల్లపు ప్రాంతాల్లో నివాసం ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించింది. 17 జిల్లాల్లో జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణా బలగాలను మోహరింపజేసింది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి అక్కడి ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది. సెలవుల్లో ఉన్న అధికారులను వెంటనే- విధుల్లో చేరాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకూ సెలవులను మంజూరు చేయవద్దని సూచించారు.












Click it and Unblock the Notifications