Cyclone Gulab: తిత్లీ కంటే బీభత్సం: ఏపీ సహా ఆ రెండు రాష్ట్రాల్లో హైఅలర్ట్: బీచ్ బంద్: కేంద్రం రివ్యూ
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. తుఫాన్లా మారనుంది. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్పై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. 2018లో సంభవించిన తిత్లీ తుఫాన్ తరహాలో విరుచుకుపడే ప్రమాదం ఉందంటూ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. దీని తీవ్రత తిత్లి తుఫాన్ను పోలి ఉంటుందని అంచనా వేస్తోన్నారు. అదే స్థాయిలో అసాధారణ ఆస్తి, పంట నష్టాన్ని మిగిల్చడానికీ అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
తీరానికి మరింత చేరువగా..
బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అది మరింత తీవ్ర రూపాన్ని సంతరించుకుంది. వచ్చే 12 గంటల్లోగా పెనుతుఫాన్గా మారనుంది. తుఫాన్గా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఈ తుఫాన్కు గులాబ్గా పేరు పెట్టారు. పాకిస్తాన్ ఈ పేరును సూచించింది. ఒడిశాలోని గోపాల్పూర్కు తూర్పు-ఆగ్నేయ దిశగా 470 కిలోమీటర్లు, ఏపీలోని కళింగ పట్నానికి 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది.
ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఆదివారం సాయంత్రం నాటికి ఈ గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటుతుందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోస్తా ఉత్తర ప్రాంతంలోని తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కూడా.
పలు చోట్ల భారీ వర్షాలు..
ఒడిశాలోని కేంద్రపారా, జగత్సింగ్పూర్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా, పూరీ, గంజాం, గజపతి, కొంధమాల్, రాయగడ, నవరంగ్పూర్, జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈదురుగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
24 ఎన్డీఆర్ఎఫ్ బలగాలు
తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సంక్షోభ నిర్వహణ కమిటీ సభ్యులు, కేంద్రం హోం మంత్రిత్వ శాఖ, విపత్తుల నిర్వహణ విభాగం, రెవెన్యూ అధికారులు ఇందులో పాల్గొన్నారు. తుఫాన్ తీవ్రతకు గురయ్యే రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే 18 జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను మోహరింపజేశామని అన్నారు.
ఏడు జిల్లాల్లో హైఅలర్ట్
తుఫాన్ తీవ్రత అధికంగా ఉండే ఒడిశాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఏడు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. గజపతి, గంజాం, రాయగడ, కోరాపుట్, మల్కాన్గిరి, నవరంగ్పూర్, కొంధమాల్ జిల్లాల అధికార యంత్రాంగం నష్ట నివారణ చర్యలను తీసుకుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నట్లు ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పీకే జెనా తెలిపారు. రాష్ట్రస్థాయి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను తీర ప్రాంతాల్లో మోహరింపజేసినట్లు చెప్పారు. మరిన్ని జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు రానున్నాయని అన్నారు.
బీచ్లు క్లోజ్..
తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాల్లో బీచ్లన్నింటినీ మూసివేసినట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా భావిస్తోన్న గంజాం జిల్లా గోపాల్పూర్లో బీచ్ను మూసివేశామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించామని గంజాం జిల్లా కలెక్టర్ తెలిపారు. అతి భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలంకే కేంద్రం నుంచి ఆదేశాలు అందినట్లు చెప్పారు.

పశ్చిమ బెంగాల్ అలర్ట్..
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఇప్పటికే రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అందులో ఒకటి తీవ్ర వాయుగుండంగా మారింది. తుఫాన్గా మారనుంది. వాటి ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంత జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్ భారీ వర్షపాతాన్ని నమోదు చేసుకుంది. గులాబ్ తుఫాన్ పొంచివున్న నేపథ్యంలో- పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.












Click it and Unblock the Notifications