దూసుకొస్తున్న తుఫాను: ఎపిలో 4 జిల్లాలకు ముప్పు
న్యూఢిల్లీ/ హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడి పెను తుఫాను హుధుద్ విశాఖపట్నం తీరం వైపు దూసుకొస్తోంది. శనివారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో తుఫాను విశాఖపట్నం తీరానికి 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. తుఫాను తీవ్రంగా ఉందని ఐఎండి డిజి ఎల్ఎస్ రాథోడ్ శనివారం ఢిల్లీలో చెప్పారు.
రేపు ఆదివారం మధ్యాహ్నానికి తుఫాను విశాఖపట్నం వద్ద తీరాన్ని దాటుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. ఒడిషాలో 8 జిల్లాలపై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పో గోదావరి జిల్లాలపై దాని ప్రభావం ఉంటుందని చెప్పారు. రేపు ఆదివారం మధ్యాహ్నం తీరం దాటి ఆ తర్వాత తుఫాను బలహీన పడే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
కాగా, ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హుధుద్ తుపాను ప్రభావంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం అత్యున్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఏ సాయం కావాలన్నా చేస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది.
శ్రీకాకుళం తుపాను జిల్లాలోని తీరాన్ని తాకుతుందని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తొలుత ఒరిస్సా, తర్వాత విశాఖ తీరాన్ని తాకుతుందని భావించినప్పటికీ దిశ మార్చుకుని శ్రీకాకుళం జిల్లాలోని తుపాను తీరం దాటుతుందని అంటున్నారు. తుపాను పెను ఉప్పెనగారానున్న దృష్ట్యా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను కలెక్టర్ మీడియాకు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 25 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఇతర రక్షణ బృందాలు విధుల్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
తుపాను నేపథ్యంలో ఈపీడీసీఎల్ ఐదు జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. టోల్ఫ్రీ నెంబర్లు, సహాయక సిబ్బందితో పాటు 35 వైర్లెస్ సెట్లు, 100 మొబైల్ ఫోన్లను సిద్ధం చేశారు. విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను ఎప్పటికప్పుడు తొలగించేలా 50 క్రేన్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ అత్యవసర సేవల కోసం ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ వైర్లు, ఎలక్ర్టికల్ పరికరాలను సిద్ధం చేశారు.
హుధుద్ కారణంగా మేఘాలపై అతి శీతల వాతావరణం నెలకొని ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. సాధారణంగా -20 నుంచి -25 డిగ్రీల వరకు ఉండే ఉష్ణోగ్రత -53కు చేరుకుందని తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చునని హెచ్చరించింది. ఇవి హరికేన్లంత బలంగా ఉంటాయని చెప్పారు.