Cyclone Nisarga: మహారాష్ట్రలో బీభత్సం, ముంబై అతలాకుతలం, జారిన విమానం
ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైని అతలాకుతలం చేసింది. నిసర్గ తీవ్ర తుఫాను బుధవారం మధ్యాహ్నం ముంబైలోని అలీబాగ్ వద్ద తీరాన్ని తాకింది. తీరం దాటే పక్రియ సుమారు మూడు గంటలపాటు సాగింది. ఆ తర్వాత తుఫాను తీవ్రత క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే. అప్పటికే ఈ తుఫాను పెను బీభత్సాన్ని సృష్టించింది.
Recommended Video
భారీ వర్షాలు, ఈదురు గాలులు
ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు తీవ్ర తుఫాను నేపథ్యంలో అప్రమత్తమయ్యాయి. తుఫాను తీరం దాటే సమయంలో 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మహారాష్ట్రలోని పలు జిల్లాలతోపాటు ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల చెట్లు నేలకూలాయి. పలు ఇళ్ల పైకప్పులు కూలిపోయాయి. భారీ విధ్వంసమే జరిగింది.
ముంబైలో హై అలర్ట్..
ముంబైలో తుఫాను నేపథ్యంలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. రెండ్రోజులపాటు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సీఎం ఉద్ధవ్ థాక్రే కోరారు. ముంబై విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు. పలు విమానాలను రద్దు చేశారు. వర్షం కారణంగా విమానాశ్రయం రన్ వేపైకి భారీగా వర్షపు నీరు చేరింది.
వర్షపు నీటిలో జారిన ఫెడెక్స్ విమానం..
ఈ క్రమంలో బెంగళూరు నుంచి ముంబై చేరుకున్న ఫెడెఎక్స్కు చెందిన సరుకు రవాణా చేసే విమానం ఒకటి ముంబై విమానాశ్రయంలో రన్ వేపై జారింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ ఘటన వల్ల విమాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో బుధవారం రాత్రి 7 గంటల వరకు విమానాశ్రయంలో రాకపోకలు నిషేధించినట్లు వెల్లడించింది.
జలమయమైన ప్రాంతాలు.. సహాయక చర్యలు
భారీ వర్షాల కారణంగా ముంబైతోపాటు పుణెలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహారాష్ట్రలోని రాయగఢ్, రత్నగిరి, పాల్ఘర్, సింధు, థానే జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉంది. అనేక గ్రామాల ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు.. పెను విధ్వంసం తప్పింది..
ఇప్పటికే మహారాష్ట్రలో 50వేల మందిని, గుజరాత్లో 70వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంబై పరిసర ప్రాంతాల్లో 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. గుజరాత్లో 15 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. అయితే, నిసర్గ తుఫాను తీరం తాకిన తర్వాత వెంటనే బలహీనపడటంతో ముంబైకి పెను విధ్వంసం తప్పింది.












Click it and Unblock the Notifications