Cyclone Tauktae:కేరళ పై మరోసారి తుఫాను పంజా..స్వర్గసీమకు ముప్పు- తిరుపతిపై ప్రభావం
తిరువనంతపురం: కేరళ పై ప్రకృతి పగబట్టిందా.. అంటే ఔననే అనిపిస్తుంది. ఎంతో పచ్చగా ఉండే కేరళ స్వర్గ సీమపై వరుస తుఫాన్లు పంజా విసురుతున్నాయి. ఇప్పటికే కరోనాతో ఆరాష్ట్రం కళ తప్పగా... తుఫాన్లు అక్కడ జలప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో కేరళలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా కేరళపై తౌక్తా తుఫాను పంజా విసురుతోంది.
Recommended Video
కేరళను చిదిమేస్తున్న తౌక్తా తుఫాను
స్వర్గసీమగా పిలుచుకునే కేరళ రాష్ట్రంపై వరుస తుఫాన్లు బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోకి నైరుతీ రుతు పవనాలు ప్రవేశించేందుకు ఇంకా రెండు వారాల గడువు ఉండగానే అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనంతో వర్షాలు ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సముద్రంలో అలలు దాదాపు ఒక మీటరు ఎత్తు ఎగిసిపడుతూ తమ ప్రతాపాన్ని చాటుతున్నాయి. సముద్రంకు దగ్గరలో నివసిస్తున్న చాలా కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. వారి ఇళ్లు చాలా వరకు కూలే పరిస్థితికి వచ్చాయి. ఇక రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇద్దరు మృతి చెందారు. ఒక వ్యక్తి మృతదేహం ఎర్నాకులంలోని చెల్లనమ్లో నీటిలో చిక్కుకుపోయి కనిపించింది.
కేరళలో భారీ వర్షాలు
మల్లాపురంలోని పొన్నానిలో 50 ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. కొడున్గల్లూరులో 100 కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. కోజికోడ్లోని బేపోర్ - గోతీశ్వరం బీచ్రోడ్ దాదాపుగా డ్యామేజ్ అయ్యింది. కొడున్గల్లూర్ మరియు చవ్వకాడ్ ప్రాంతంలో సముద్రం ముందుకు వచ్చింది. ఇక భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆరు నౌకలు కొల్లాం పోర్టులోనే లంగరేసి ఉన్నాయి. ఇందులో మూడు శ్రీలంకకు చెందిన నౌకలున్నాయి. ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది. కంట్రోల్ రూం ప్రకారం 17 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 337 మందికి ఆశ్రయం కల్పించినట్లు అధికారులు చెప్పారు. మరిన్ని సహాయక శిబిరాలను తెరుస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్ని ఇళ్లు ధ్వసం అయ్యాయనేదానిపై రెవిన్యూ శాఖ లెక్కలు సేకరిస్తోంది.
అరేబియా సముద్రంలో తీవ్రరూపం దాల్చిన అల్ప పీడనం
ఇదిలా ఉంటే అరేబియా సముద్రంలో అల్పపీడనం మరింత తీవ్రరూపం దాల్చిందని భారత వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం లక్షద్వీప్ వద్ద కేంద్రీకృతమై ఉందని కన్నూరుకు పశ్చిమ-నైరుతి దిశలో 310 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. రానున్న 12 గంటల నుంచి 24 గంటల్లో ఇది మరింత బలపడి ఉత్తర వాయువ్య దిశగా పయనించి మంగళవారం నాటికి గుజరాత్ తీరంను తాకుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయానికి తుఫాను బలపడి గంటకు 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మల్లాపురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసరగాడ్ ప్రాంతాల్లో ప్రమాదకర హెచ్చరికలు జారీ చేశారు. పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులను చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని ప్రభుత్వం సూచించింది. ఇక తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది. హైదరాబాదులో శుక్రవారం భారీ వర్షాలు కురియగా రాయలసీమలోని పలుప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.