Cyclone Tauktae: ఇంకో 72 గంటలు: పెను తుఫాన్గా: ఆ రెండు రాష్ట్రాల మధ్య తీరం తాకే ఛాన్స్
ముంబై: యావత్ దేశాన్ని ప్రస్తుతం ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది. ఎటు చూసినా కరోనా విలయమే కనిపిస్తోంది. కరోనా ధాటికి లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారు. కరోనా పేషెంట్లకు చికిత్సను అందించడానికి ఆసుపత్రులు చాలట్లేదు. పడకలు సరిపోవట్లేదు. ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. ఈ పరిణామాల మధ్య తుఫాన్ రూపంలో మరో కొత్త చిక్కు వచ్చి పడబోతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం పెను తుఫాన్గా మారే అవకాశాలు లేకపోలేదు. వచ్చే 72 గంటల్లో అంటే.. ఈ నెల 15వ తేదీ నాటికి ఇది తుఫాన్గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తోన్నారు.
ఈ తుఫాన్కు తౌక్టే (Cyclone Tauktae)గా నామకరణం చేశారు. తుఫాన్గా ఆవిర్భవించిన తరువాత ఇది క్రమంగా భారత పశ్చిమ తీరం వైపు ప్రయాణించడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర-గోవా మధ్య తీరాన్ని దాటడానికి అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో వచ్చే 48 నుంచి నాలుగు రాష్ట్రాల కోస్తా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు. మహారాష్ట్ర దక్షిణ ప్రాంత జిల్లాలు, గోవా, కర్ణాటక, కేరళ ఉత్తర ప్రాంత జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తోన్నారు.
తుపాన్ ప్రభావం మాల్దీవులు, లక్షద్వీప్ పైనా ఉంటుందని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం తొలుత వాయుగుండంగా.. అనంతరం తుఫాన్గా మారుతుందని ఆ సమయంలో అరేబియా సముద్రంలో అలలు ఒక మీటరు కంటే ఎత్తుకు ఎగసిపడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అల్పపీడన తీవ్రతను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. మత్స్యకారులెవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. దీనికి అనుగుణమైన ముందస్తు సూచనలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు వెంటనే వెనక్కి వచ్చేయాల్సి ఉంటుందని చెప్పారు.