Cyclone Yaas: నేడు విలయరూపం -రెండు రాష్ట్రాలపై తుపాను పడగ -మోదీ ఆదేశంతో అసాధారణ సన్నద్ధత
అరేబియా సముద్రంలో తలెత్తిన తౌక్తే తుపాను విలయాన్ని మర్చిపోకముందే, బంగాళాఖాతంలో రాకాసి తుపాను అలజడిరేపుతున్నది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. యాస్ తుపానుగా వ్యవహరిస్తోన్న ఈ విపత్తు సోమవారం నాటికి తుపానుగా మారనుంది. రాగల 24 గంటల్లో మరింత పుంజుకుని అతితీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది.
Recommended Video
యాస్ తుపాను ప్రస్తుతం పోర్ట్బ్లెయిర్కి ఉత్తర వాయువ్యదిశగా 590 కి.మీ, పారాదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 570 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. అది ఈ నెల 26(బుధవారం) సాయంత్రానికి ఉత్తర ఒడిశాలోని పారాదీప్, పశ్చిమబెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. వాయుగుండం కారణంగా ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 25-27 మధ్య ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కింలోని పలు జిల్లాల్లో ఈ స్థాయిలో వర్షాలు కురవనున్నాయి.

యాస్ తుపాను ప్రభావంతో సోమవారం నాడు బంగాళాఖాతంలో గంటకు 65 - 85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈనెల 26న తుపాను తీరం దాటేంత వరకు గంటకు 90-110 కి.మీ వేగంతో, తీరం దాటేటప్పుడు 155-165 నుంచి 185 కిలోమీటర్ల వరకు వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ఆయా తేదీల్లో మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా, అసాధారణంగా మారుతుందని చెప్పారు. సోమవారం అండమాన్ నికోబార్ దీవుల్లో అలలు 1-2 మీటర్ల వరకూ ఎగసిపడతాయన్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
బంగాళఖాతంలో తలెత్తిన యాస్ తుపానను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తుపాను సన్నద్ధతపై ఉతస్థాయి సమావేశం నిర్వహించి, చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, తీర ప్రాంతాల్లో ముప్పున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్-19 సోకి చికిత్స పొందుతున్న వారికి, వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంతవరకు విద్యుత్తు, సమాచార వ్యవస్థలు దెబ్బతినకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. యాస్ తుపానును ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్.ప్రధాన్ చెప్పారు. ఇక..
తుపానును ఎదుర్కొనేందుకు నౌకాదళం, తీరగస్తీ దళం (కోస్ట్గార్డ్) అప్రమత్తమయ్యాయి. నాలుగు యుద్ధ నౌకలు, 11 సరకు రవాణా విమానాలు, 25 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు నేవీ ప్రకటించింది. ఆదివారం కోల్కతా, పోర్ట్బ్లెయిర్లకు 334 ఎన్డీఆర్ఎఫ్ దళాలను, 21 టన్నుల సామగ్రిని భారత వాయుసేన చేరవేసింది. విశాఖలోని ఐఎన్ఎస్ డేగా, చెన్నైకి సమీపంలోని ఐఎన్ఎస్ రాజాలిపై విమానాలు సిద్ధంగా ఉన్నాయని... ఇవి తుపాను సమయంలో ఏరియల్ సర్వే చేసి సహాయక చర్యలు చేపడతాయని వివరించింది. తౌక్టే తుపాను అనుభవాల నేపథ్యంలో చమురు క్షేత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. యాస్ అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. 59 రైళ్లను శనివారం రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.












Click it and Unblock the Notifications