ఏపీ, తెలంగాణలకు తుఫాన్ ముప్పు: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
న్యూఢిల్లీ: కొద్దిరోజుల కిందటే దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాలను వణికించిన జంట తుఫాన్లు తౌక్టే, యాస్ సద్దుమణిగిన అతి కొద్దిరోజుల్లోనే మరొకటి ఆవిర్భవించనుంది. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడనున్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సాయంత్రం నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని, వచ్చే 72 గంటల్లో అది తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీని ప్రభావం వల్ల ఒడిశా, ఛత్తీస్గఢ్, ఏపీ-తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాలు, విదర్భ, జార్ఖండ్లల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Recommended Video
దీని ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచి వచ్చే 48 గంటల పాటు ఒడిశాలో వర్షాలు కురుస్తాయని అన్నారు. 13వ తేదీ వరకు ఛత్తీస్గఢ్, శని, ఆదివారాల్లో ఛత్తీస్గఢ్, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, విదర్భ, జార్ఖండ్లల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తోన్న బలమైన ఈదురుగాలుల వల్ల 15వ తేదీ వరకు కర్ణాటక, మహారాష్ట్ర కోస్తా తీర ప్రాంత జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని అన్నారు.
బంగాళాఖాతం తూర్పు-మధ్య ప్రాంతం, ఉత్తరానికి ఆనుకుని ఈ అల్పపీడనం ఏర్పడటానికి అనువైన వాతావరణం నెలకొని ఉన్నట్లు అధికారులు చెప్పారు. బంగాళాఖాతం ఉపరితలంపై మిడిల్ ట్రోపోస్ఫియర్లో చోటు చేసుకుంటోన్న మార్పుల వల్ల ఈ అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొన్నారు. క్రమంగా అది తుఫాన్గా మారుతుందని స్పష్టం చేశారు. అల్పపీడనం ఏర్పడిన తరువాత అది తుఫాన్గా ఆవిర్భవించి, తీరం దాటేంత వరకూ మూడు నుంచి ఆరు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని అన్నారు.
మరోవంక-నైరుతి రుతుపవనాలు క్రమంగా మరింత విస్తరించాయి. దీని ప్రభావంతో ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో అతి భారీ వర్షాలు పడ్డాయి. తాజాగా దేశ రాజధానిపై రుతు పవనాల ప్రభావం పడింది. ఢిల్లీ సహా సోనిపట్, పానిపట్, పల్వాల్, కురుక్షేత్ర, కర్నాల్, జింద్, జజ్ఝర్, ఫరీదాబాద్, బల్లబ్గఢ్, బాగ్పట్, బులంద్షహర్, అలీగఢ్, నొయిడా, గ్రేటర్ నొయిడా, దాద్రి, షమ్లీ, ముజప్ఫర్నగర్, మోడీనగర్, మీరట్, ఘజియాబాద్, హపుర, ఖేక్రాల్ల వర్షపాతం నమోదైంది.