ఐఏఎస్ రవి కేసులో ఎవరినీ వదలం, వేచి చూడండి: సిఎం సిద్దరామయ్య
బెంగళూరు: ఐఎఎస్ అధికారి రవి మరణానికి సంబంధించిన ఎలాంటి విషయాలు దాచి పెట్టబోమని, అలాగే ఆయన మరణానికి కారణం అయిన వారిని ఎలాంటి పరిస్థితులలో రక్షించబోమని కర్ణాటక ముఖ్య మంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. శనివారం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు.
సోమవారం శాసన సభ సమావేశాలలో ఐఏఎస్ అధికారి రవి కేసు విషయం దర్యాప్తుపై తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునేది వెల్లడిస్తామని, అంత వరకు వేచి చూడాలని చెప్పారు. ఐఏఎస్ అధికారి రవి కేసు దర్యాప్తు సీఐడికి వద్దు, సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయని, మీరు మనస్సు మార్చుకున్నారా అని ప్రశ్నించగా అన్నింటికి సోమవారం సమాధానం ఇస్తానని సిద్దరామయ్య అన్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో ఐఏఎస్ అధికారి రవి ఆత్మహత్య చేసుకున్నారని అధికారులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టికి చెందిన కొందరు నాయకులు రవి మీద ఒత్తిడి తీసుకు వచ్చి వేధించడం వల్లనే ఇలా జరిగిందని బీజేపీ, జేడీఎస్ నాయకులు అంటున్నారు.
డి.కే. రవి కోలారు జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న సమయంలో కొందరు రాజకీయ నాయకులు రవికి ఫోన్లు చేసి మాట వినకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారనే ఆరోపణలు ఉన్నాయి. అందు వలనే ఆఘమేఘాల మీద రవిని బెంగళూరులోని వాణిజ్య పన్నుల శాఖకు బదిలి చేశారు.
ఇక్కడ కాంగ్రెస్ పార్టికి చెందిన నాయకులే రవిని ఇబ్బంది పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు పూర్తిగా వెలుగు చూస్తాయని బీజేపీ, జేడీఎస్ నాయకులు అంటున్నారు.