ఆర్థిక సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తోన్న పోస్టుమ్యాన్లు
ఢిల్లీ: తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్రప్రభుత్వం ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ను పోస్టాఫీసుల్లో ప్రారంభించింది. ఈ క్రమంలోనే పోస్టల్ శాఖ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కు సంబంధించి దేశవ్యాప్తంగా 650 జిల్లాల్లో ప్రారంభించింది. ఇందులో 1.5 లక్షల పోస్టాఫీసులు మరియు 3 లక్షలు పోస్టుమెన్లకు స్మార్ట్ ఫోన్లు, ఇతరత్రా డిజిటల్ పరికరాలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. వీటి ద్వారా ప్రజలకు ప్రత్యేకించి మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక సేవలు మరింత దగ్గర చేయాలన్న ఉద్దేశంతో పోస్టల్ శాఖ పనిచేస్తోంది.
ఐపీపీబీతో ప్రయోజనాలు
* నగదు బదిలీ
* ప్రభుత్వం నుంచి వచ్చే నగదు నేరుగా ఖాతాలోకి బదిలీ
* బిల్ చెల్లింపులు
* పెట్టుబడులు
* బీమా సౌకర్యం
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కింద పోస్ట్ మెన్లు ఇంటి దగ్గరకే ఈ సేవలను తీసుకొస్తున్నారు. ఐపీపీబీ ద్వారా డిజిటల్ లావాదేవీలు కూడా జరపొచ్చు. ఈ లావాదేవీల ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలను కూడా పొందొచ్చు. ఉదాహరణకు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజనలాంటి పథకాల నుంచి చేకూరే ప్రయోజనాలు పొందొచ్చు.
ఐపీబీబీ యొక్క ముఖ్య ఉద్దేశం మూడు లక్షల మంది పోస్టుమెన్ల ద్వారా ఆర్థిక సేవలు నేరుగా ఇంటి దగ్గరకే తీసుకెళ్లడం. ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడ ఉండే రైతులకు, చిన్న స్థాయి వ్యాపారులకు డిజిటల్ లావాదేవీల గురించి వివరిస్తారు. మరి కొద్ది నెలల్లో ఐపీపీబీలు 1.5 లక్షలు పోస్టాఫీసుల్లో సేవలు అందించనున్నాయి.