చైనా నుంచి పారిపోయి వస్తే..: గుర్తు చేసుకున్న దలైలామా
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆదివారం ఓ వ్యక్తిని ఆప్యాయంగా పలకరించారు. ఆయన పేరు నరేన్ చంద్రదాస్. ఆయన 5 అసోం రైఫిల్స్లో హవాల్దార్గా సేవలందించి పదవీ విరమణ చేశారు.
గౌహతి: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆదివారం ఓ వ్యక్తిని ఆప్యాయంగా పలకరించారు. ఆయన పేరు నరేన్ చంద్రదాస్. ఆయన 5 అసోం రైఫిల్స్లో హవాల్దార్గా సేవలందించి పదవీ విరమణ చేశారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..
1959లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చైనా నుంచి పారిపోయి వచ్చిన దలైలామాను మరో ఆరుగురితో కలసి కాపాడారు. ప్రస్తుతం చంద్రదాస్ ఒక్కరే జీవించి ఉన్నారు. గౌహతిలో నిర్వహిస్తున్న నమామి బ్రహ్మపుత్ర ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా గతస్మృతులను దలైలామా గుర్తుకు తెచ్చుకున్నారు. తనను కాపాడిన ఆయనకు ఏం ఇచ్చి రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు.
రహస్యంగానే ఉంచుతా
మీ చర్మ సౌందర్యానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ప్రముఖ టిబెటిన్ ఆధ్యాత్మిక గురువు దలై లామా ఆసక్తికర సమాధానం చెప్పారు. తన చర్మ సౌందర్యం గురించి రహస్యంగా ఉంచడమే తనకు ఇష్టమని చెప్పారు. ఎనభై ఏళ్లకు పైగా వయస్సు ఉన్నా ఇప్పటికీ 70 సంవత్సరాల వ్యక్తిగా కనిపిస్తున్నారని భక్తులు అంటుంటారని, ఇదేలా సాధ్యమని అడుగుతున్నారని చెప్పారు.
సభికుల నవ్వులు
అది రహస్యమని, మీకు చెప్పనని దలైలామా అన్నారు. దీంతో సభికుల్లో నవ్వులు విరిశాయి. నోబెల్ శాంతి బహుమతి విజేత అయిన దలైలామా గత ఏడాది జులైలో 81వ పడిలోకి అడుగుపెట్టారు. గౌహతి విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో దలైలామా పాల్గొన్నారు.
వ్యాఖ్యాత అడిగితే..
ఈ సందర్భంగా దలైలామా మాట్లాడారు. బాహ్య సౌందర్యానికి ఇచ్చే ప్రాధాన్యత కంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచించారు. ఆధునిక కాలంలో ప్రాచీన భారత జ్ఞానంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళా వ్యాఖ్యాత అడిగిన చర్మసౌందర్యం ప్రశ్నకు సమాధానం చెప్పారు. మహిళలు సమాజంలో మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. తన తొలి గురువు మరెవరో కాదని అమ్మ మాత్రమేనన్నారు. ఆడవాళ్లు మానసికంగాఎంతో దృఢంగా ఉంటారని కితాబిచ్చారు.
భారత ప్రభుత్వానికి 58 సంవత్సరాలుగా అతిథిగా ఉన్నానని, తనవంతుగా దేశ సంస్కృతిని నలువైపులా వ్యాపింప జేసే సందేశకుడినని దలైలామా వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక గురువు భారత్ పర్యటనను చైనా విమర్శిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో దలైలామా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.