భారత్ సరిహద్దులో దలైలామా పుట్టినరోజు వేడుకలు: చైనాకు కాలింది, బ్యానర్లతో నిరసన
లడఖ్: ప్రముఖ బౌద్ధ గురువు, టిబెట్కు చెందిన దలైలామా పుట్టిన రోజు వేడుకలను జరపడంపై చైనా సైనికులు నిరసన తెలిపారు. తూర్పు లడఖ్లోని డెమ్చోక్లో దలైలా పుట్టినరోజు వేడుకలను భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. దలైలామాను తమ శుత్రువుగా చూసే చైనాకు ఈ పరిణామం మింగుడు పడలేదు.
ఈ క్రమంలోనే దలైలామా పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడాన్ని నిరసిస్తూ.. సింధు నదిపై వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) దగ్గరలో చైనా సైనికులు బ్యానర్లను ప్రదర్శించారు. చైనా సైనికులు కొందరు తమ దేశ పౌరులతో కలిసి ఐదు వాహనాల్లో వచ్చి కమ్యూనిటీ సెంటర్ నుంచి 200 మీటర్ల దూరంలో బ్యానర్లు ప్రదర్శించారు. దలైలామా పుట్టిన రోజు జరుపుకున్న ప్రాంతానికి సమీపంలోనే బ్యానర్లతో నిరసన తెలిపారు.

సింధునది పక్కనే ఉన్న కోయల్ గ్రామంలోని డోలా తమ్గో వద్ద జులై 6న ఈ ఘటన చోటు చేసుకుంది. చైనా మాండరిన్లో బ్యానర్లు ప్రదర్శించడంతో ఏం రాశారో అర్థం కాలేదని అక్కడి భారతీయులు తెలిపారు. దాదాపు అరగంటసేపు నిరసన తెలిపిన చైనా సైనికులు ఆ తర్వాత వెళ్లిపోయారు. డెమ్చోక్ ప్రాంతం భారత భూభాగం కాగా, తమదేనంటూ చైనా వాదిస్తోంది. చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్కు చెందినదని
చెబుతోంది. దీంతో ఈ ప్రాంతం వివాదాస్పదంగా మారింది.
కాగా, దలైలామా 86వ పుట్టిన రోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం జీవించాలని ఆకాంక్షించారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీని దలైలామా కలుసుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన ముఖ్య అనుచరులు తెలిపారు. కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిన తర్వాత దలైలామా ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications