ప్రేమ వివాహం: ఇంజనీరింగ్ విద్యార్థి హత్య
చెన్నై: తమిళనాడులో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతుల మీద మారణాయుధాలతో దాడి చేశారు. భర్తను దారుణంగా హత్య చేసి భార్య మీద దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. తమిళనాడులోని తిరువూర్ లో నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లో పట్టపగలే ఈ దారుణం జరిగిందని సోమవారం పోలీసులు చెప్పారు.
ఈ దారుణం అంతా మార్కెట్ లో, రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని పోలీసు అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న శంకర్ (23), కౌసల్యా (20) అనే ఇద్దరు 8 నెలల క్రితం పెద్దలను ఎదిరించి పళనిలోని దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.
శంకర్ దళితుడు. కౌసల్య అగ్రకులం నుంచి వచ్చింది. ఈ వివాహం కౌసల్యా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని సమాచారం. ఆదివారం శంకర్, కౌసల్యా మార్కెట్ దగ్గర వెలుతున్న సమయంలో కొందరు వ్యక్తులు శంకర్ ను ఫుట్ పాత్ మీదకు లాగారు. తరువాత అతని మీద ఇష్టం వచ్చినట్లు వేటకోడవళ్లతో దాడి చెయ్యడంతో అక్కడే మరణించాడు.
అనంతరం కౌసల్యాను రోడ్డు మీద కిందపడేసి దాడి చెయ్యడం మొదలు పెట్టారు. ఆమెకు తీవ్రగాయాలైనాయి. పోలీసులు వస్తారని భయపడిన నిందితులు ముగ్గురూ ఒకే బైక్ మీద అక్కడి నుంచి పరారైనారు. తమ కుమారుడిని కౌసల్యా కుటుంబ సభ్యులు హత్య చేసి ఉంటారని శంకర్ తండ్రి వేలు స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.