పెట్రోల్ పోసి దళితుడి ఇంటికి నిప్పు: 2 సజీవదహనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీదాబాద్లోని సోన్పెడ్ గ్రామంలో దారుణం జరిగింది. మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఓ దళిత కుటుంబం నివసిస్తున్న ఇంటికి నిప్పు పెట్టగా, ఇద్దరు చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరా తీశారు.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్కి ఫోన్ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండు కులాల మధ్య వివాదంగా భావిస్తున్న ఈ ఘటనపై రాజ్నాథ్ సింగ్ సీఎంతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, దళితులపై ఎలాంటి అకృత్యాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో అందజేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఫరీదాబాద్ జిల్లాలోని సోన్పెడ్ గ్రామంలో జరిగిన ఈ ఘనటకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దళిత కుటుంబానికి చెందిన జితేందర్ (27) అనే వ్యక్తి ఆ గ్రామంలో మెడికల్ ప్రాక్టిషనర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య రేఖ (24), ఇద్దరు పిల్లలు వైభవ్ (2), దివ్య (1).
ఇటీవలే అదే గ్రామానికి చెందిన ఠాకూర్ కమ్మూనిటీకి బల్వంత్ అనే కుటుంబంతో కొద్ది రోజుల క్రితం వాగ్వాదం జరిగింది. గొడవను మనసులో ఉంచుకున్న ఠాకూర్ కమ్యూనిటీకి చెందిన 9 మంది మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణానికి ఒడిగట్టారు.
జితేందర్ నివాసానికి చేరుకున్న ఠాకూర్ కులస్తులు కిటికిలో నుంచి ఇంట్లోకి పెట్రోల్ పోశారు. అనంతరం నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో జితేందర్ ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. జితేందర్, తన భార్య తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రస్తుతం వీరిద్దరూ ఢిల్లీలోని సప్ధార్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై జితేందర్ మాట్లాడుతూ కిటికిలో నుంచి వారు ఇంట్లోకి పెట్రోల్ పోసిన సమయంలో ఆ వాసనకు తనకు మెలకువ వచ్చింది.
తన భార్యను నిద్ర లేపే లోపు నిప్పుపెట్టారు. తన ఇద్దరు పిల్లలు వైభవ్ (2), దివ్య (1) మంటల్లో సజీవ దహనమయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామంలో భద్రత కట్టుదిట్టం చేశారు.












Click it and Unblock the Notifications