కోవిడ్ వ్యాక్సినేషన్ : ఏ రాష్ట్రాలు వెనుకబడ్డాయి... ఏ రాష్ట్రాల్లో మెరుగ్గా ఉంది...
దేశవ్యాప్తంగా జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్లో కొన్ని రాష్ట్రాలు వెనుకబడ్డాయి. బిహార్,రాజస్తాన్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వ్యాక్సినేషన్లో ఎక్కువగా వెనుకబడ్డాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ 71 శాతం మేర వెనుకబడినట్లు వెల్లడైంది. కేరళ,ఢిల్లీ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ రికార్డు మెరుగ్గా ఉన్నప్పటికీ.. డిసెంబర్ నాటికి 60 శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వాలన్న లక్ష్యానికి అవి ఇంకా చాలా దూరంలోనే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం 22 శాతం మేర తక్కువ వ్యాక్సినేషన్ నమోదవుతోంది.
దేశవ్యాప్తంగా మొత్తంగా 54 శాతం మేర తక్కువ వ్యాక్సినేషన్ నమోదైంది. అధిక జనాభా కలిగిన కొన్ని పెద్ద రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత నెమ్మదిగా సాగుతోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ అతి తక్కువ వ్యాక్సినేషన్ నమోదవుతోంది. ఇప్పటివరకూ బిహార్లో 71శాతం,రాజస్తాన్లో 66శాతం,పశ్చిమ బెంగాల్లో 66శాతం,ఉత్తరప్రదేశ్లో 64శాతం,జార్ఖండ్లో 62శాతం మేర తక్కువ వ్యాక్సినేషన్ నమోదైంది. ఇక కేరళ,ఢిల్లీల్లో 22శాతం చొప్పున,పంజాబ్లో 26శాతం,కర్ణాటకలో 30శాతం,గుజరాత్లో 37శాతం తక్కువ వ్యాక్సినేషన్ నమోదైంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 36కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.ఇందులో గడిచిన 24 గంటల్లోనే 40 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 18-44 ఏళ్ల వయసు వారు 11 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్ స్పీడ్ను ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఏయే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతుందో... అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Recommended Video
కరోనా కేసుల విషయానికి వస్తే... గడిచిన 24 గంటల్లో కొత్తగా 43 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 911 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 4,00,600కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,58,727 యాక్టివ్ కేసులు ఉన్నాయి.