నాశనం చేసుకుంటున్నాం, ఇదీ ఇండియా!: దావోస్లో మోడీ, టెక్నాలజీ-ఉగ్రవాదంపై ఇలా
Recommended Video
దావోస్/న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2018లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇరవై ఏళ్ల తర్వాత భారత ప్రధాని దావోస్ వేదికపై మాట్లాడారు. అంతకుముందు 1997లో నాటి ప్రధాని దేవేగౌడ దావోస్లో ప్రసంగించారు.
దావోస్ వేదికపై కడసారి 1997లో దేవేగౌడ ప్రసంగించారని మోడీ తన ప్రసంగంలో గుర్తు చేశారు. 1997లో భారత భారత జీడీపీ 400 బిలియన్ డాలర్లు మాత్రమే అన్నారు. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. టెక్నాలజీ ప్రజల జీవితాలను పూర్తిగా మార్చి వేసిందన్నారు.
ప్రపంచ దేశాలు అభివృద్ధి దిశలో పయనించేలా సదస్సు దోహదపడుతుందని చెప్పారు. ఇరవై ఏళ్ల కిందటికి ఇప్పటికి భారత జీడీపీ ఆరు రెట్లు పెరిగిందని చెప్పారు. భారత్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
సైబర్ పరిజ్ఞానాన్ని చెడుకు వినియోగించకుండా నియంత్రించడం సవాలుగా మారిందన్నారు. ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబమని చెప్పారు. పరస్పర ఆధారిత సమాజ అభివృద్ధిలో ఆర్థిక సదస్సు చుక్కానిగా వ్యవహరిస్తోందన్నారు.
సాంకేతిక పరంగా ఇంటర్నెట్, బిగ్ డేటాతో ప్రపంచమంతా అనుసంధానం అవుతోందని చెప్పారు. మన మాట, పని, చేతలను అన్నింటిని సాంకేతికత ప్రభావం చేస్తోందన్నారు. వసుదైవ కుటుంబం అనే భావనను భారత్ ప్రపంచానికి ఎప్పుడో చాటి చెప్పిందన్నారు. వసుదైక కుటుంబం భారత తాత్విక చింతన అన్నారు.
మనమంతా భూమాత సంతానం అని చెప్పారు. కానీ ఆ భూమిని ఇప్పుడు మనమే నాశనం చేస్తున్నామని చెప్పారు. పర్యావరణ మార్పులు ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పారు. మంచు తుఫానులను మనం చూస్తున్నామని చెప్పారు.
ప్రకృతితో మమేకమై జీవించడం భారత దైనందిక జీవితంలో భాగమన్నారు. ప్రస్తుత తరం సుఖం కోసం మనం ప్రకృతిని నాశనం చేయవద్దని కోరారు. మన సంతోషాల కోసం మనమే భూమిని నాశనం చేసే స్థాయికి దిగజారామన్నారు. ఆయుర్వేదం, యోగాను భారత్ ప్రపంచానికి పరిచయం చేసిందని చెప్పారు.
దేశాభివృద్ధి కోసం సాంకేతికత సరైనదే కానీ దాని కోసం ప్రకృతిని నాశనం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పులు కూడా విశ్వం మనుగడకు సవాలుగా మారిందని చెప్పారు. మనం భూమి పుత్రులమనే విషయం గుర్తుకు పెట్టుకోవాలన్నారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న మరో సమస్య టెర్రరిజం అన్నారు. యావత్ ప్రపంచానికి ఉగ్రవాదం పెనుసవాలుగా మారిందని వ్యాఖ్యానించారు. విద్యావంతులైన యువకులు కూడా ఉగ్రవాదం వైపు మరలుతున్నారని చెప్పారు. సమ్మిళిత అభివృద్ధి అనేది 120 కోట్ల మంది భారతీయుల ఆశయం అన్నారు.
సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేది బీజేపీ నినాదం అని చెప్పారు. మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపట్టిందని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వ ప్రజాస్వామ్యమే తమ దేశానికి గర్వకారణం అన్నారు. భిన్న మతాలు, సంస్కృతులు, భాషలు కలిగిన దేశంలో అందరినీ ఏకతాటిపై నిలుపుతోంది ప్రజాస్వామ్యం అన్నారు. అందుకే భారత ప్రజాస్వామ్యం రాజకీయ విధానం కాదని, జీవన శైలి అన్నారు.
స్వతంత్ర భారత దేశంలో తొలిసారి ఏకీకృత పన్ను జీఎస్టీని తీసుకు వచ్చామని చెప్పారు. పెట్టుబడిదారులకు భారత్ స్వాగతం పలుకుతోందని చెప్పారు. అసాధారణ నిర్ణయాలతో వ్యాపార అనుకూల అవకాశాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. బేటీ పడావో.. బేటీ బచావో వంటి కార్యక్రమాలను చేపట్టామని అన్నారు.
ప్రపంచ ఆర్థిక ప్రగతిలో మరింత క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. వ్యాపార అనుకూల ర్యాంకింగులో ఇటీవల భారత్ బాగా మెరుగుపడిందని చెప్పారు.