ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటనకు ముందు భారత్కు షాక్: సబ్మెరైన్ ప్రాజెక్ట్ నుంచి నేవల్ గ్రూప్ ఔట్
న్యూఢిల్లీ/ప్యారిస్: ఫ్రెంచ్ కంపెనీ నేవల్ గ్రూప్.. ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (AIP) వ్యవస్థకు సంబంధించిన ప్రతిపాదన (RFP) అభ్యర్థనలో పేర్కొన్న షరతుల కారణంగా, భారత నావికాదళం కోసం ఆరు సాంప్రదాయ జలాంతర్గాములను దేశీయంగా నిర్మించాల్సిన కేంద్ర ప్రాజెక్ట్ P-75Iలో పాల్గొనలేమని మంగళవారం తెలిపింది. ఇది భారతదేశానికి ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు.
ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్లో పర్యటించనున్న క్రమంలో నేవల్ గ్రూప్ నుంచి ఈ ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ను ప్రధాని మోడీ కలవనున్నారు.
ఏఐపీ సిస్టమ్ అనేది కన్వన్షెనల్ సబ్మెరైన్ ను నీటిలో ఎక్కువ సమయం ఉంచడంతోపాటు అత్యధిక వేగంగా ప్రయాణించేందుకు దోహదపడుతుంది. లార్సెన్ అండ్ టూబ్రో అనే ప్రవేట్ కంపెనీ, ప్రభుత్వ సంస్థ మజగావ్ డాక్స్ లిమిటెడ్లకు పీ-751 ప్రాజెక్ట్ కోసం గత ఏడాది జూన్లో ఎంపిక చేసింది కేంద్ర రక్షణ శాఖ.
ఈ రెండు భారత సంస్థలు విదేశీ కంపెనీలైన thyssenKrupp మెరైన్ సిస్టమ్స్ (జర్మనీ), నవాంటియా (స్పెయిన్), నావల్ గ్రూప్ (ఫ్రాన్స్), డేవూ (దక్షిణ కొరియా), రోసోబోరోనెక్స్పోర్ట్ (రష్యా)లతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం అప్పగించిన రూ. 43వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కోసం భారతీయ కంపెనీలు లార్సెన్ అండ్ టూబ్రో, మజగావ్ డాక్స్ లిమిటెడ్ పనిచేస్తున్నాయి.
ఈ రెండు భాగస్వామ్య కంపెనీలు ఆర్ఎఫ్లో పెట్టిన పలు షరతుల కారణంగా తాము ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు నేవల్ గ్రూప్ ఇండియా కంట్రీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లూరెంట్ వీడే తెలిపారు. తాము ఆశించన విధంగా ఈ రెండు భాగస్వాముల నుంచి స్పందన రాలేదని చెప్పారు.
కాగా, ఆత్మనిర్భర్ భారత్ సూత్రాలతో ఇండియన్ నేవీకి చెందిన పీ751 ప్రాజెక్టులో భాగస్వామి అయ్యేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ, కొన్ని షరతుల కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. అయితే, భారత ప్రభుత్వం, భారతీయ నేవీ, ఇతర సంస్థలతో పనిచేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పుకొచ్చారు.