అదృశ్యం: మురికి కాలువలో శవమై తేలిన విద్యార్థిని (వీడియో)
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ఓ విద్యార్థిని మురికికాలువలో శవమై కనిపించింది. ఫిబ్రవరి 10వ తేదీన రాణిలక్ష్మీభాయి కళాశాలలో 12వ తరగతి చదువుతున్న ఉన్నతి విశ్వకర్మ అనే విద్యార్థిని కనిపించకుండా పోయింది.
ఈ మేరకు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఫోన్ ట్రాక్ చేయగా ఓ ఆటోరిక్షా డ్రైవర్ దగ్గర ఫోన్ దొరికింది. అతడిని విచారించగా తనకు ఆ ఫోన్ ఓ చోట దొరికిందని చెప్పాడు.
ఆ తర్వాత అదే ప్రాంతంలో గాలింపు చేపట్టగా సోమవారం విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. కాగా, ఈ ప్రాంతం రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నివాసానికి కొద్ది దూరంలోనే ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేశారా? అనే అనుమానాలు నెలకొన్నాయి. మొదట విద్యార్థిని డ్రైనేజీలో శవమై తేలిందని వార్తలు వెలువడగా, ఆ తర్వాత పోలీసులు చెట్టుకు వేలాడుతూ ఆమె మృతదేహం లభించిందని తెలిపారు.