భూమి అమ్మకం: చనిపోయిన వ్యక్తి కోర్టుకు వచ్చాడు!
ఇండోర్: అవును. మీరు చదివింది నిజమే. ఏడాదిన్నర క్రితం చనిపోయిన ఓ వ్యక్తి కోర్టుకు వచ్చాడు. రూ. కోట్ల విలువ చేసే తన భూమి(78వేల చదరపు అడుగుల)ని ఇతరులకు అమ్మేందుకు అతడు కోర్టుకు వచ్చాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో చోటు చేసుకుంది.
వాస్తవానికి బిశ్వ బీహారీ అవస్థి ఫిబ్రవరి 9, 2011లో చనిపోయాడు. కానీ, భూ బదిలీ రికార్డు ప్రకారం.. అతడు జూలై 2, 2012లో ఎస్డీఎం కోర్టు ముందు హాజరయ్యాడు. తన భూమిని నాగేంద్ర సింగ్, వీరేంద్ర సింగ్ అనే ఇద్దరికీ అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకు సంబంధించిన పేపర్లపైనా అతడు సంతకం చేశాడు.
ఈ మోసమంతా.. రాజేంద్ర కె గుప్తా అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో డివిజనల్ కమిషనర్ సంజయ్ దూబే ఈ అంశంపై విచారణ జరుపుతున్నారు.
‘ఇలాంటి ఘటనలు భారతదేశంలోనే జరుగుతాయి. చనిపోయిన వ్యక్తి తన భూమి బదిలీ కోసం కోర్టుకు వస్తాడు. జీవించిన వ్యక్తులు తాము బతికే ఉన్నామని కోర్టుల చుట్టూ తిరుగుతారు' అని గుప్తా మండిపడ్డారు. ఇదంతా రెవెన్యూ అధికారులు, లాండ్ మాఫియాతోనే జరుగుతోందని ఆరోపించారు.
ఆర్టీఐ అందించిన సమాచారం ప్రకారం.. పత్నిపురా ప్రాంతానికి చెందిన నాగేందర్, వీరేంద్ర సింగ్ సదరు 78వేల చదరపు అడుగుల భూమిని తమ పేరున బదిలీ చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. బిశ్వా బీహారీ అవస్థి, అతని కుటుంబం పేరున ఉన్న భూమిని తమకు అమ్మేశారని.. తమ పేరున ఆ భూమిని బదిలీ చేయాలని దరఖాస్తు కోరారు.
ఈ నేపథ్యంలోనే గుప్తా ఆర్టీఐలో సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 11, 2011నే అవస్థి చనిపోయారని సూపర్ స్పెషాలిటీ సెంటర్, ఐఎంసి సర్టిఫికేట్(నెం. 31102283) ఇచ్చిందని మార్చి 10, 2011లో పేర్కొంది. 2011లోనే చనిపోయిన అవస్థి.. 2012లో వచ్చి అతని భూమిని ఎలా బదిలీ చేయగలరని ఆయన ప్రశ్నించారు.