మరణించిందనుకున్న 21 ఏళ్ల యువతి తిరిగొచ్చింది
చెన్నై: దాదాపు రెండు నెలల కిందట మరణించిందని భావించిన యువతి ప్రాణాలతో వచ్చింది. ఆమె తిరిగి రావడంతో అందరినీ ఆనందంతో పాటు ఆశ్చర్యంలో ముంచెత్తింది. సమాచారం మేరకు.. తమిళనాడు పుడుకొట్టైకి చెందిన ఇరవై ఒక్క ఏళ్ల వినీల అనే యువతి అదృశ్యమైంది.
ఆమె కోసం వెతికిన తల్లిదండ్రులు ఆమె ఆచూకీ లభ్యంకాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు పద్నాలుగో తేదిన రసియమంగళంలోని యూకలిప్టస్ ఫారెస్ట్ వద్ద ఓ అమ్మాయి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ఆ మృతదేహం మిస్సయిన వినీలదేమోననే అనుమానంతో ఆమె తల్లిదండ్రులను పిలిపించారు.
ఆ మృతదేహాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తేనని అనుకున్నారు. ఇంటికి తీసుకెళ్లి ఆ మృతదేహానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. కొన్ని నెలలు గడిచిన తరువాత ఈ దీపావళి సమయంలో వినీల ఇంటికి చేరుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
విషయం తెలిసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి, ఆ తరువాత తల్లిదండ్రులకు ఆప్పగించారు. ఇల్లు ఎందుకు వదిలి పెట్టావని న్యాయస్థానం ప్రశ్నించగా.. తన తల్లిదండ్రులతో గొడవ కారణంగా ఇల్లు విడిచి వెళ్లానని ఆ యువతి తెలిపింది. కాగా, ఆమె కోయంబత్తూరులోని తుడియాలూర్ వద్ద కొన్ని రోజులు కూలీ పని చేసింది.