Sabarimala కేసులో బిగ్ ట్విస్ట్! భక్తుల పక్షాన కేంద్ర ప్రభుత్వం..
కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆచారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో కీలక అడుగు వేసింది. 2018లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన తీర్పును 'తప్పుగా నిర్ణయించబడినది' (Bad in Law) గా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరింది.
తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా తన వాదనలను బలంగా వినిపించారు. భారతీయ నాగరిక విలువలను పశ్చిమ దేశాల కళ్లద్దాలతో చూడవద్దని ఆయన హితవు పలికారు.

అంటరానితనం కాదు.. అది ఆచార గౌరవం!
2018 నాటి తీర్పులో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని 'అంటరానితనం' (ఆర్టికల్ 17) తో పోల్చడంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కేవలం వయసు ఆధారంగా విధించిన నిబంధన అని, దీనికి అంటరానితనానికి సంబంధం లేదని తుషార్ మెహతా వాదించారు. అయ్యప్ప స్వామి 'నైష్ఠిక బ్రహ్మచారి' అన్న ప్రత్యేక స్వభావం కారణంగానే ఈ ఆంక్షలు వచ్చాయని, దేశంలోని ఇతర అయ్యప్ప ఆలయాల్లో మహిళలకు ప్రవేశం ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. "ఏది ఆవశ్యక మతాచారం అనేది నిర్ణయించడం న్యాయస్థానాల పని కాదు.. అది మత గ్రంథాల అవగాహనతో కూడిన ఆధ్యాత్మిక అంశం" అని ఆయన స్పష్టం చేశారు.
దిగుమతి చేసుకున్న సిద్ధాంతాలు వద్దు..
భారతీయ సంస్కృతిలో మహిళలకు అత్యున్నత స్థానం ఉందని, ఇక్కడి ఆచారాలను పితృస్వామ్య ధోరణి లేదా లింగ వివక్ష అనే పశ్చిమ దేశాల మూస పద్ధతుల్లో చూడకూడదని ఎస్జీ కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 హామీ ఇచ్చిన మత స్వేచ్ఛను మతాల మధ్య సమానత్వంగా చూడాలని, దీన్ని లింగ వివక్షతో ముడిపెట్టడం సరికాదని సూచించారు. ఏదైనా మత సంస్కరణలు కావాలనుకుంటే అది శాసనసభల బాధ్యత అని, కోర్టుల జోక్యం పరిమితంగా ఉండాలని కేంద్రం పేర్కొంది.
జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు..
వాదనల సందర్భంగా ధర్మాసనంలోని జస్టిస్ బి.వి. నాగరత్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని అధికరణం 17 ప్రాథమిక హక్కు అని గుర్తు చేస్తూనే.. ఒక నెలలో మూడు రోజులు అంటరానితనం ఉండి, నాలుగో రోజు ఉండదని అనుకోవడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. దీనిపై మెహతా స్పందిస్తూ.. తాను రుతుక్రమం గురించి మాట్లాడటం లేదని, శబరిమల ఆచారాలు కేవలం వయసు పరిమితికి సంబంధించినవని స్పష్టతనిచ్చారు.
తొమ్మిది మంది ధర్మాసనం ముందు ఏడు ప్రశ్నలు..
ప్రస్తుతం ఈ విస్తృత ధర్మాసనం కేవలం శబరిమల కేసునే కాకుండా, మతపరమైన ఆచారాల్లో కోర్టుల జోక్యం ఎంతవరకు ఉండాలి? రాజ్యాంగ నైతికత అంటే ఏమిటి? మతానికి సంబంధం లేని వ్యక్తులు పిటిషన్లు వేయవచ్చా? వంటి ఏడు కీలక రాజ్యాంగ ప్రశ్నలను పరిశీలిస్తోంది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ఈ ధర్మాసనం ఇచ్చే తీర్పు కేవలం శబరిమలకే కాక, దేశంలోని మతపరమైన స్వేచ్ఛకు కొత్త నిర్వచనాన్ని ఇవ్వబోతోంది.
కేరళలో ఎన్నికల వేడి కొనసాగుతున్న వేళ, శబరిమల అంశం మళ్ళీ సుప్రీంకోర్టు గడపపై నిలవడంతో అటు రాజకీయాల్లో, ఇటు భక్తులలో ఉత్కంఠ నెలకొంది. ధర్మ శాస్త్రాలకు, రాజ్యాంగ సూత్రాలకు మధ్య జరుగుతున్న ఈ మథనంలో అంతిమ విజయం ఎవరిదో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications