సుభాష్ చంద్రబోస్ రహస్య ఫైళ్లు: కీలక మలుపు, ప్యానల్ ఏర్పాటు
న్యూఢిల్లీ: సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి రహస్యాలను బయటపెట్టాలనే డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్యానెల్ను ఏర్పాటు చేసింది. అధికారిక రహస్యాల చట్టాన్ని పునఃసమీక్షించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రధాని కార్యాలయం, రా, ఐబీ, కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక పరిశీలన బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం తెలిపారు.
ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయనను బెర్లిన్లో సుభాష్ చంద్రబోస్ మునిమనవడు సూర్యకుమార్ బోస్ రెండు రోజుల క్రితం కలిశారు. ఈ సందర్భంగా నేతాజీ గురించిన రహస్యాలను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.
నేతాజీకి సంబంధించి 41 రహస్య ఫైళ్లు ఉన్నాయి. అందులో ఐదు ఫైళ్లను ఆర్టీఐ చట్టం ప్రకారం బహిర్గతం చేయాలని కేరళకు చెందిన ఫణికర్ అనే ఐటీ నిపుణుడు పీఎంవోకు ఈ ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఫైళ్లను బహిర్గతపరిచే అధికారం లేదని పీఎంవో స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం దాదాపు ఇరవై ఏళ్ల పాటు సుభాష్ చంద్రబోస్ కుటుంబం పైన నిఘా ఉంచిందనే వార్తలు ప్రకంపనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతాజీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.