కేంద్రం సంచలన నిర్ణయం- భారత ఆర్మీకి ఎమర్జెన్సీ పవర్స్: రూ.40,000 కోట్లు
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల అమానుష దాడికి ప్రతీకారంగా భారత్.. పాకిస్తాన్ పై యుద్ధానికి దిగిన విధానం, ఆ సమయంలో వ్యవహరించిన తీరు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలతో దాడులను విరమించుకోవడం.. విమర్శలకు దారి తీస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల అభ్యంతరాలూ వ్యక్తమౌతోన్నాయి.
ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు ఏపీకి చెందిన వాళ్లు కూడా ఉన్నారు. ఈ దాడి పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘాతుకానికి పాకిస్తాన్ కారణమని భావించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ దేశ భూభాగంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు సాగించింది.

అదే సమయంలో పాకిస్తాన్ సైన్యం సైతం దాడులకు దిగింది. డ్రోన్లు, మిస్సైళ్లు, మోర్టార్ షెల్స్ తో కాల్పులు జరిపింది. దీన్ని భారత్ సమర్థవంతంగా అడ్డుకుంది. ప్రతిదాడులతో శత్రుదేశాన్ని ఉక్కిరిబిక్కిరికి గురి చేసింది. ఇది మరింత తీవ్రతరమౌతుందనుకున్న దశలో డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నారు. ఆయన సూచనలతో భారత్- పాక్ కాల్పుల విరమణ ప్రకటించాయి.
ఆపరేషన్ సింధూర్ కు తాత్కాలికంగా మాత్రమే బ్రేక్ పడిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పాకిస్తాన్ ఎప్పుడు తోక ఝాడించినా మలిదశ దాడులు ఉంటాయంటూ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఉగ్రవాద దాడులు జరిగితే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందనీ స్పష్టం చేశారు.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఆయుధాలు, మందుగుండు, ఇతర డిఫెన్స్ పరికరాలను కొనుగోలు చేయడానికి ఆర్మీకి అత్యవసర అధికారాలను అప్పగించింది. దీనికోసం దాదాపు 40,000 కోట్ల రూపాయలను కేటాయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.
అత్యవసర అధికారాల కింద కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భేటీలో ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ కౌన్సిల్ సమావేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, సైనిక అధికారులు హాజరయ్యారు.
ఈ అత్యవసర అధికారాల కింద సర్వైలెన్స్ డ్రోన్లు, కామికేజ్ డ్రోన్లు, లాంగ్ రేంజ్ లోయిటరింగ్ మ్యూనిషన్స్, ఫిరంగులు, వైమానిక రక్షణ, వివిధ రకాల క్షిపణులు, రాకెట్ల కోసం మందుగుండు వంటి పరికరాలను కొనుగోలు చేయడంపై దళాలు దృష్టి సారించాయి. మున్ముందు వీటి అవసరం మరింత ఏర్పుడే అవకాశం ఉందని, అందుకే- ఈ డీల్ ను కేంద్రం ఆమోదించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
ఆయా యుద్ధ సామాగ్రి, ఇతర పరికరాలన్నింటినీ కూడా ఆర్మీ.. నిర్ణీత గడువులోగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రక్షణ- ఆర్థిక విభాగం నుండి సలహాదారుల పర్యవేక్షణలో ఈ కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుంది. అయిదు సంవత్సరాల కాలంలో రక్షణ దళాలకు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అత్యవసర సేకరణ అధికారాలను ఇవ్వడం ఇది అయిదోసారి.
రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు, సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సహా ప్రైవేట్ పరిశ్రమలతో సంప్రదింపులు మొదలుపెట్టారు కూడా. రాడార్ల కోసం ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం ఆరు రాడార్లకు ఇది అదనం.












Click it and Unblock the Notifications