ప్రతీ 10అత్యాచారాల్లో 7 అవే.. అబ్బాయిల ఆలోచనా దృక్పథం మారాలి: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న ప్రతి 10 అత్యాచారాల్లో 7 వరకు బాధితురాలికి పరిచయం ఉన్నవారో, ఇంట్లోవారో, బంధువులో చేస్తున్నారని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. చిన్నారులపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యాచారాలకు అమ్మాయిల డ్రెస్సింగే కారణం అనడాన్ని సీతారామన్ తప్పుపట్టారు. అదే నిజమైతే మరి వృద్ధులపై ఎందుకు అత్యాచారం జరుగుతున్నాయని ప్రశ్నించారు. అమ్మాయిల దుస్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఫిక్కీ మహిళా విభాగం నిర్వహించిన సమావేశంలో సీతారామన్ అత్యాచార ఘటనలపై స్పందించారు.
కాగా, రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతారామన్ ను ఫిక్కీ మహిళా విభాగం సోమవారం సన్మానించింది. ఈ సందర్భంగా స్త్రీ పురుష సమానత్వంపై ఆమె ఓ నివేదికను విడుదల చేశారు. అత్యాచార ఘటనలు జరగకుండా ఉండాలంటే.. మొదట అబ్బాయిల ఆలోచన దృక్పథం మారాలని సీతారామన్ సూచించారు.
ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టు అమ్మాయి ఇంటినుంచి బయటకెళ్తుంటే జాగ్రత్తలు చెప్పడం కాదు.. బయటికెళ్లినప్పుడు ఎలా ఉండాలన్న దానిపై అబ్బాయిలకు జాగ్రత్తలు చెప్పాలని అన్నారు. దేశంలోని వ్యాపార, మార్కెటింగ్ రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారని సీతారామన్ అన్నారు. ముద్ర బ్యాంకు ఇచ్చే రుణాల్లో 50శాతం మహిళలకే వెళ్తున్నాయని, పంచాయితీరాజ్ సవరణతో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని చెప్పారు. ఇక రక్షణ రంగంలోనూ పురుషులతో సమానంగా స్త్రీల అవకాశాల కోసం కృషి చేస్తున్నామని అన్నారు.