పెగాసస్ పై పార్లమెంటులో కేంద్రం ప్రకటన- తయారీదారుతో ఎలాంటి లావాదేవీల్లేవని వెల్లడి
పెగాసస్ వివాదం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్ని కుదిపేస్తున్న వేళ కేంద్రం ఇవాళ స్పందించింది. పెగాసస్ తయారీదారుతో కేంద్రం కుమ్మక్మై నిఘా పెట్టిందన్న విమర్శల నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. దీంతో విపక్షాల ఆందోళనలకు పుల్ స్టాప్ పెట్టేసినట్లయింది.
ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ తయారీదారు అయిన ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్ తో కేంద్రం ఎలాంటి లావాదేవీలు జరపలేదని రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ పార్లెమంటులో ప్రకటించారు. సీపీఎం ఎంపీ డాక్టర్ శివదాసన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అజయ్ భట్ ఈ ప్రకటన చేశారు. ఈ మేరకు రాతపూర్వకంగా కూడా పార్లమెంటుకు తెలిపారు. ఇప్పటివరకూ తాము ఎలాంటి నిఘా పెట్టలేదని చెప్తూ వస్తున్న కేంద్రం.. ఇవాళ చేసిన ప్రకటన తర్వాత కూడా విపక్షం సంతృప్తి చెందలేదు.
పెగాసస్ తయారీదారు ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్ తాము ప్రభుత్వాలు, ప్రభుత్వ ఏజెన్సీలకు మాత్రమే నిఘా సాఫ్ట్ వేర్ అమ్మినట్లు చెప్తున్న నేపథ్యంలో విపక్షాలు మాత్రం కేంద్రాన్ని టార్గెట్ చేయడం మానడం లేదు. ఇవాళ కూడా పార్లమెంటు ఉభయసభల్ని స్తంభింపజేశాయి. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న ఈ అంశంపై ఇంతకంటే ఎక్కువ చెప్పలేమంటూ కేంద్రం చెప్తున్నా విపక్షాలు మాత్రం పట్టు వీడటం లేదు. దీంతో పార్లమెంటు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
వాస్తవానికి మూడు వారాలుగా సాగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పెగాసస్ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాలు ఇరుకునపెడుతూనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు కూడా సిద్ధం కాకపోవడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ప్రధాని మోడీతో పాటు లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ కూడా విపక్షాలు విలువైన ప్రజా ధనాన్ని, పార్లమెంటు కాలాన్ని వృథా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా విపక్షాలు మాత్రం పెగాసస్ పై కేంద్రం విచారణకు ఆదేశించాల్సి్ందేనని పట్టుబడుతున్నాయి. సుప్రీంకోర్టులో ఉన్న అంశమే అయినా కేంద్రం పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.