ట్రాఫిక్లో వరుడు-మండపంలో వధువు: ఇది మెట్రో చేసిన పెళ్లి!
కొచ్చి: పెళ్లి సమయం దగ్గరపడుతోంది. వధువు పెళ్లి మండపానికి చేరుకుంది. వరుడు మాత్రం పెళ్లి వేదికకు చేరుకునే ప్రయత్నంలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు. ఏం చేయాలో తెలియదు. అప్పుడే ఒకరు మెట్రోలో వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో వెంటనే మెట్రో రైలులో ఎక్కి పెళ్లి మండపానికి చేరుకున్నాడు వరుడు.
ఇంకేముందు.. అంతా అనుకున్నట్లు ఆ వివాహం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో తమ పెళ్లిని మెట్రోనే చేసిందంటూ ఆ నవ దంపతులు ఆనందంగా చెప్పుకుంటున్నారు. ఈ పెళ్లి విషయాన్ని కొచ్చి మెట్రో కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడం గమనార్హం.
టెన్షన్ పెరిగిపోయింది
కేరళలోని పాలక్కడ్కు చెందిన రంజిత్కుమార్కు ఎర్నాకుళంలోని ధన్యతో వివాహం కుదిరింది. డిసెంబర్ 23న పెళ్లికి ముహుర్తం నిర్ణయించారు. రెండు ప్రాంతాలకు మధ్య దూరం 130 కిలోమీటర్లు. పెళ్లి మంటపానికి వెళ్లేందుకు వరుడి కుటుంబం ఆ రోజు ఉదయం 6 గంటలకే ఇంటి నుంచి బయల్దేరింది. అయితే ఆ మార్గంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఉదయం 11 గంటలైనా వారు ఎర్నాకుళం చేరుకోలేకపోయారు. దీంతో వారిలో టెన్షన్ పెరిగిపోయింది.
మెట్రో ఉందిగా..
కాగా, ఏం చేయాలో అర్థం కాని సమయంలో మెట్రోలో వెళ్లండంటూ కొందరు వారికి సలహా ఇచ్చారు. ఇంకేం ఆలోచించకుండా అలువా ప్రాంతంలోని మెట్రో స్టేషన్కు వెళ్లారు. అయితే అక్కడ కూడా రద్దీ ఎక్కువగానే ఉంది. దీంతో ఈ రోజు తన పెళ్లి ఉందని, వెంటనే వెళ్లాలని చెప్పి టికెట్లు సంపాదించారు రంజిత్.
పెళ్లి సమాయానికి చేర్చిన మెట్రో
మెట్రో రైలెక్కి సమయానికి చేరుకుని పెళ్లి పీటలెక్కారు వరుడు. ఆ తర్వాత వారి పెళ్లి ఘనంగా జరిగింది. కాగా, తమ పెళ్లి జరిగిన విధానాన్ని రంజిత్, ధన్య ఓ వీడియో మెసేజ్లో చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
మెట్రో ఆనందం.. ప్రత్యేక కార్డు ఆఫర్
కాగా, రంజిత్, ధన్య వీడియోను కొచ్చి మెట్రో తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. అంతేగాక, వారికి ‘కోచి వన్' కార్డు కూడా అందజేయడం గమనార్హం. ఆ కార్డుతో ఈ వధూవరులకు మెట్రో రైలులో ప్రత్యేక ప్రవేశం ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, కేరళలోని తొలి మెట్రో రైలు కొచ్చి మెట్రోను ఈ ఏడాది జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే.