ఢిల్లీలో 10 మంది ఆప్ కౌన్సిలర్లకు రూ.100 కోట్ల ఆఫర్-మేయర్ కోసం బీజేపీ ఎత్తులు
ఢిల్లీ కార్పోరేషన్ కు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైనా 134 సీట్లు గెల్చుకుని మేయర్ సీటుకు అవసరమైన 126 సీట్ల మ్యాజిక్ మార్కును సాధించింది. అయితే ఆప్ కూ, బీజేపీకి మధ్య సీట్ల వ్యత్యాసం భారీగా లేకపోవడంతో బీజేపీకి మేయర్ సీటుపై ఆశ కలుగుతోంది. దీంతో ఇప్పటికే మేయర్ సీటు తమదేనని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు అనుకున్నట్లుగానే బేరసారాలు మొదలుపెట్టేశారు.
ఆప్ కు చెందిన 10 మంది కౌన్సిలర్లు బీజేపీకి మద్దతిస్తే వారికి రూ.100 కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లు ఆప్ నేతలు ఇవాళ ఆరోపించారు. బీజేపీకి మద్దతిచ్చే కౌన్సిలర్లకు రూ.50 లక్షల చొప్పున ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు కూడా ఆప్ నేతలు తెలిపారు. తాము ఇచ్చే డబ్బు తీసుకుని ఢిల్లీ మేయర్ సీటుకు తమకు మద్దతివ్వాలని కౌన్సిలర్లను బెదిరిస్తున్నట్లు ఆప్ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు పలువురు ఆప్ కౌన్సిలర్లు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలు వెల్లడించారు.
ఆప్ కౌన్సిలర్లను బెదిరిస్తున్న బీజేపీ నేతల్ని అరెస్టు చేసి విచారణ జరపాలని ఆప్ నేతలు ఇవాళ ఢిల్లీ పోలీసు కమిషనర్ ను కోరారు. తమకన్నా 30 సీట్లు తక్కువగా గెల్చుకున్న బీజేపీ మేయర్ సీటుపై ఎలా ఆశలు పెట్టుకుంటుందని ఆప్ నేత సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆప్ కౌన్సిలర్లకు ఫోన్లు చేస్తున్న బీజేపీనేతల వివరాలను కూడా ఆప్ వెల్లడించింది. వీరిపై తక్షణం కేసులు నమోదు చేసి విచారణ చేయాలని పోలీసులను కోరుతోంది. అయితే దీనిపై బీజేపీ కానీ, పోలీసులు కానీ స్పందించలేదు.