ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: ఏ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చింది... ఓటర్లు ఎవరివైపు నిలుస్తారు?
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదురోజుల మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచార వేగంను పెంచాయి. ఫిబ్రవరి 8న జరిగే పోలింగ్లో 1.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు అంటే ఆమ్ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. వన్స్ మోర్ నినాదంతో మరోసారి కేజ్రీవాల్ ఇతర రెండు పార్టీలకు బలమైన పోటీని ఇస్తున్నారు. ఇక బీజేపీ మాత్రం అవినీతి రహిత పాలన అందిస్తామంటూ ఢిల్లీ ఎన్నికలకు వెళుతుండగా, కాంగ్రెస్ వాలి ఢిల్లీ నినాదంతో హస్తం పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే ఏఏ పార్టీలు ఏఏ హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయో ఒకసారి చూద్దాం.

విద్యుత్ తాగునీరు సరఫరా
మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే 10 పాయింట్లతో కూడిన హామీలకు తాను గ్యారెంటీగా నిలుస్తానని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లకు చెప్పారు. ఇందులో భాగంగా నిరంతరయంగా విద్యుత్ సరఫరా, ప్రతి ఇంటికీ పైపులైను ద్వారా నీరు అనే హామీలను ఇచ్చారు. ఇప్పటికే ఢిల్లీ నగరంలో తమ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను ఇస్తోందని కేజ్రీవాల్ ప్రచారంలో చెబుతున్నారు. ఇక ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇవ్వడమే తన తదుపరి లక్ష్యం అని ఈ హామీని నెరవేరుస్తామని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీలానే బీజేపీ కూడా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్న హామీని ఇచ్చింది. ఇక కాంగ్రెస్ కూడా 300 యూనిట్ల వరకు ఎలాంటి విద్యుత్ చార్జీలు ఉండవని తన మేనిఫెస్టోలో పొందుపర్చింది. కేజ్రీవాల్ ప్రభుత్వం 200 యూనిట్లు వరకు పరిమితి విధించింది.

గుర్తింపు లేని కాలనీలను రెగ్యులరైజ్ చేస్తామన్న బీజేపీ
అధికారికంగా గుర్తింపునకు నోచుకోని కాలనీలకు కనీస సదుపాయాలను సమకూరుస్తామని ఇందులో భాగంగా అందుబాటు దరలోనే నాణ్యతమైన హెల్త్ కేర్, పరిసరాలు శుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు చెత్తను తీసిపారేసేలా చర్యలు తీసుకుంటామని ఆప్ పేర్కొంది. ఇదిలా ఉంటే ఢిల్లీ పరిసరాల్లో 1797 అనధికారిక కాలనీలను రెగ్యులరైజ్ చేస్తామంటూ బీజేపీ ప్రకటించింది. ఈ కాలనీల అభివృద్ధి కోసం ఒక అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇక అనధికారిక కాలనీలను రెగ్యులరైజ్ చేయడంతో పాటు రూ.35వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

విద్యార్థులు విద్యకు సంబంధించిన హామీలు
పాఠశాల విద్యా కార్యక్రమం కింద డిగ్రీ వరకు చదువుకునే విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తామని కేజ్రీవాల్ చెప్పగా... 10 కొత్త కాలేజీలు, 200 కొత్త స్కూళ్లతో పాటు విద్యార్థులు చదువుకునేందుకు లైబ్రరీలు కూడా నిర్మిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇక మహిళా భద్రత కోసం మొహల్లా మార్షల్స్ను నియమిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. 2015లో ఇదే తరహా మహిళా పోలీసులను బస్సుల్లో నియమించడం జరిగింది. ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక బీజేపీ మాత్రం రానున్న ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.ఇప్పుడు ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఇవి అదనం అని స్పష్టం చేసింది. ఇక కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లను, 9వ తరగతి చదివే విద్యార్థినిలకు సైకిల్ ఇస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. బీహార్లో కూడా నితీష్ సర్కార్ ఇదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేసింది.

న్యాయ్ పథకాన్ని అమలు చేస్తామంటున్న కాంగ్రెస్
ఇక ఆర్థికంగా వెనకబడిన తరగతుల అమ్మాయిల వివాహాలకు 51 వేలు ఆర్థిక సహాయం చేస్తుందన్న అంశాన్ని బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇక కిలో రెండు రూపాయలకే గోదుమపిండి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇదే హామీతో బీజేపీ 15 ఏళ్ల పాటు ఛత్తీస్గఢ్లో పాలన సాగించింది. ఇక కాంగ్రెస్ 2019 లోక్సభ ఎన్నికల్లో న్యాయ్ పథకాన్ని తీసుకొచ్చింది. అదే పథకాన్ని ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. నిరుద్యోగ భృతి కింద డిగ్రీ చదివిన వారికి నెలకు రూ.5వేలు, పోస్టు గ్రాడ్యుయేట్లకు రూ.7500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

రవాణా వ్యవస్థకు సంబంధించిన హామీలు
ఇక ఢిల్లీ ప్రభుత్వ బస్సుల్లో అతి తక్కువ ఛార్జీలు ఉంటాయని కేజ్రీవాల్ ఇప్పటికే చెప్పారు. ఇక రహదారుల నెట్వర్క్ అభివృద్ధి కోసం రూ.55వేల కోట్లు వెచ్చిస్తామని బీజేపీ చెప్పుకొచ్చింది. మరో రూ.10వేల కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని చెప్పింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే 15వేల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి ప్రజారవాణను ప్రజలకు మరింత చేరువ చేస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ బస్సుల్లో విద్యార్థులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు కేజ్రీవాల్. ప్రస్తుతం మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటోంది. ఇక కాంగ్రెస్ కూడా మెట్రోలో ప్రయాణించే మహిళలకు, విద్యార్థులకు, సీనియర్ సిటిజెన్లకు సబ్సీడీ ఇస్తామని పేర్కొంది.

ఆరోగ్య పథకం గురించి హామీలు
ఈ హామీలే కాకుండా బీజేపీ ఆయుష్మాన్ పథకం, అందరికీ ఇళ్లు, పీఎం కిసాన్ స్కీమ్లను అమలు చేస్తామని కమలనాథులు చెబుతున్నారు. మరోవైపు కేంద్రం తీసుకొస్తున్న ఆయుష్మాన్ పథకం కంటే ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకమే బాగుందని చెబుతన్నారు. కేంద్రం పథకంలో కొన్ని జబ్బులు మాత్రమే ఉన్నాయని అదే ఢిల్లీ సర్కార్ తీసుకొచ్చిన స్కీమ్లో అన్ని రకాల జబ్బులకు ఉచిత వైద్యం ఉందని చెప్పారు. ఇక అధికారంలోకి వచ్చాక కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపర్చింది.

ఢిల్లీలో త్రిముఖ పోరు
మొత్తానికి ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగనుంది. 1998 నుంచి కాంగ్రెస్ను ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తూ వచ్చిన బీజేపీ... 2013లో ఒక్కసారిగా అరవింద్ కేజ్రీవాల్ పార్టీ తెరపైకి రావడం ఆ తర్వాత 2015లో ప్రభుత్వంను ఏర్పాటు చేయడంతో ఆమ్ఆద్మీ పార్టీ లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగుతోంది. ఇక కాంగ్రెస్ మాత్రం 1998 నుంచి 2013 వరకు తమ పార్టీ చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ ఈ ఎన్నికలకు సమాయాత్తమవుతోంది. ఇక ఆమ్ఆద్మీ సర్కార్ వైపే ప్రజలు ఉన్నారనే పూర్తి విశ్వాసంతో కేజ్రీవాల్ ఉన్నారు. ఇక ప్రజలు ఎవరివైపు నిలిచారన్నది తెలియాలంటే ఫిబ్రవరి 11వ తేదీ వరకు వేచిచూడక తప్పదు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications