పోలింగ్ శాతంపై ఎన్నికల అధికారులు అసంతృప్తి: ఎన్ని ప్రయత్నాలు చేసినా..ఇంతేనా.. !
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి.. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. పోలింగ్ అత్యంత తక్కువ శాతం నమోదు కావడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ శాతాన్ని పెంచడానికి, ఓటు విలువను తెలియజేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ..ఆశించిన ఫలితం కనిపించకపోవడం ఎన్నికల కమిషన్ అధికారుల్లో అసహనానికి గురి చేసినట్లు తెలుస్తోంది.
57.03 శాతం పోలింగ్ నమోదు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం ముగిసే సరికి 57.03 శాతం పోలింగ్ నమోదైంది. చివరి గంటలో ఢిల్లీ ఓటర్లలో కొద్దిగా కదలిక కనిపించడంతో ఆ మాత్రమైనా పోలింగ్ పర్సంటేజీ నమోదైంది. ఈ ఉదయం 8 గంటలకు ఆరంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు నమోదైన శాతం 22 మాత్రమే. మధ్యాహ్నం 2 గంటల వరకు 30 శాతానికి కూడా చేరుకోలేదు. 28.14 శాతం వద్దే ఆగిపోయింది.
2 నుంచి 5 గంటల మధ్య.. ఓ మోస్తరుగా..
మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య ఓ మోస్తరుగా పోలింగ్ పర్సెంటేజ్ ముందుకు కదిలింది. 2 గంటల వరకు 28.14 శాత వరకు నమోదైన పోలింగ్ శాతం.. 5 గంటల సమయానికి రెట్టింపైంది. 44.52 శాతం వద్దకు చేరుకుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉన్నందు.. చివరి గంటలో పోలింగ్ శాతం పెరుగుతందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయినప్పటికీ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో లేకపోవడం వల్ల పోలింగ్ శాతం భారీగా నమోదవుతుందిని అనుకోవడం అత్యాశే అవుతుందని అంటున్నారు.
చివరి గంటలో కాస్త పెరుగుదల..
సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి నిల్చోవడంతో వారందరికీ అవకాశాన్ని కల్పించారు. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఫలితంగా- పోలింగ్ శాతం కొద్దిగా మెరుగుపడింది. పోలింగ్ మొత్తం ముగిసే సరికి 57.03 శాతం నమోదైనట్లు ఢిల్లీ ఎన్నికల కమిషన్ అధికారి రణ్బీర్ సింగ్ తెలిపారు. పోలింగ్ శాతం తగ్గడంపై ఆరా తీయాల్సి ఉందని అన్నారు.
పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడంపై..
దేశ రాజధానిలో అక్షరాస్యుల సంఖ్య అధికంగా ఉందని, ఓటు విలువ తెలిసినప్పటికీ.. ఎందుకు దాన్ని వినియోగించుకోలేదనే విషయంపై ఆరా తీయాల్సి ఉందని రణ్బీర్ సింగ్ తెలిపారు. ఓటు విలువను తెలియజేయడానికి తాము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామని ఆయన అన్నారు. అయినప్పటికీ.. ఓటర్లలో కనిపించిన స్పందన అంతంత మాత్రమేనని చెప్పారు. 2015లో నమోదైనంత పోలింగ్ శాతం కూడా నమోదు కాలేదని అన్నారు.