అరవింద్ కేజ్రీవాల్కు సోకిన కరోనా వైరస్: ఢిల్లీపై ఒమిక్రాన్ పంజా: వ్యాక్సిన్ ప్రభావం ఏమైంది?
హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభణ మొదలు పెట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతోన్నాయి. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 33 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. అదే సమయంలో- ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతమౌతోంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 1,700. ఈ సంఖ్యకు అడ్డు, అదుపు ఉండట్లేదు. రోజురోజుకూ ఇవి పెరుగుతున్నాయి.

అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు..
ఈ పరిణామాల మధ్య పలు రాష్ట్రాలు ఆంక్షలను విధించుకున్నాయి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, హర్యానా వంటి రాష్ట్రాలు పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేశాయి. థర్డ్ వేవ్ మొదలైందంటూ నిపుణులు సైతం హెచ్చరికలను జారీ చేస్తోన్నారు. కోవిడ్ స్థితిగతులపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సైతం ఈ విషయాన్ని నిర్ధారించింది. థర్డ్వేవ్ మొదలైందని, అప్రమత్తంగా ఉండాలంటూ టాస్క్ఫోర్స్ ఛైర్మన్ హెచ్చరించారు.

కోవిడ్ విజృంభణకు నిదర్శనాలివే..
ఈ పరిస్థితుల్లో ప్రముఖులు సైతం కోవిడ్ బారిన పడుతున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన ఐసొలేషన్లో ఉంటోన్నారు. అటు బాలీవుడ్లోనూ కోవిడ్ మహమ్మారి కలకలం రేపింది. స్టార్ హీరో జాన్ అబ్రహం కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన భార్య ప్రియా రుంచాల్కు కూడా కోవిడ్ సోకింది. వారిద్దరూ కరోనా పాజిటివ్గా తేలింది. వారిద్దరూ ఇదివరకే కరోనా వైరస్ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. అయినప్పటికీ.. వైరస్ వారిని అటాక్ చేసింది.

ఢిల్లీ ముఖ్యమంత్రికీ..
తాజాగా- ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు వైరస్ సోకింది. ఈ విషయాన్ని కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. తనకు కరోనా వైరస్ సోకిందని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారందరూ కోవిడ్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. తమకు తాముగా ఐసొలేషన్లోకి వెళ్లాలని కోరారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ ఆందోళన పడొద్దని కేజ్రీవాల్ అన్నారు.

దగ్గు.. శ్వాసకోశ ఇబ్బందులు..
రెండు రోజులుగా అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఆయనను వేధిస్తోన్నాయి. రెండు రోజుల కిందట నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన దగ్గుతూ కనిపించారు. తాజాగా ఆయనకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలను చేశారు డాక్టర్లు. ఆ రిపోర్టులు పాజిటివ్గా వచ్చాయి. దీనితో ఆయన ఐసొలేషన్లోకి వెళ్లారు. ఇంట్లోనే డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే తాను సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని కేజ్రీవాల్ చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా ఆయనకు వైరస్ సోకింది.

దేశంలో 33 వేలకు పైగా
ఇదిలావుండగా.. దేశంలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 33,750 కేసులు నమోదయ్యాయి. 10,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 123 మంది ఈ మహమ్మారికి బలి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,45,582 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటిదాకా 3,42,95,407 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. 4,81,893 మంది మరణించారు.

ఢిల్లీపై ఒమిక్రాన్ పంజా..
ఢిల్లీపై ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో దేశ రాజధాని రెండో స్థానంలో ఉంది. 351 పాజిటివ్ కేసులు అక్కడ రికార్డయ్యాయి. ఇందులో 57 మంది డిశ్చార్జ్ అయ్యారు. రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లోనూ పెరుగుదల కనిపించింది. అటు మహారాష్ట్ర, కేరళల్లో రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications