కవితతో పాటే ఆయనకూ: తేలేది అప్పుడే
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించలేదు. ఈ కేసులో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆయన ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఉన్నారు. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు.
కేజ్రీవాల్ జ్యడీషియల్ కస్టడీ గడువు నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయనను రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు తన వాదనలను వినిపించారు. మరో 10 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.

ఇన్ని రోజుల పాటు నిర్వహించిన విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తమకు సహకరించట్లేదని అదనపు సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. కేసు నుంచి తప్పించుకునేలా, తనకు ఏ మాత్రం సంబంధం లేనివిధంగా వ్యవహరించారని కోర్టుకు వివరించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలను ఇచ్చారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.
ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. కేజ్రీవాల్ రిమాండ్ను పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది. ఈడీ అధికారులు కోరిన విధంగా 10 రోజుల పాటు కాకుండా ఎనిమిది రోజుల పాటు కస్టడీకి అప్పగించింది కోర్టు. ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ పంపిస్తున్నట్లు వెల్లడించింది.
ఇదే కేసులో భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమె కూడా ఈడీ, సీబీఐ అధికారుల అదుపులో ఉన్నారు. కవిత కస్టడీని కూడా రోస్ అవెన్యూ కోర్టు ఈ ఉదయమే పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్డడీకి తరలిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
లోక్సభ ఎన్నికల వేళ ఈ ఇద్దరు నాయకుల అరెస్టు వ్యవహారం అటు దేశ రాజకీయాల్లోనూ కలకలం రేపుతోంది. దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోన్నారు ఈ రెండు పార్టీల నాయకులు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలను సైతం నిర్వహించింది.












Click it and Unblock the Notifications