ఢిల్లీ ఎన్నికల రిజల్ట్స్: ఫలితాలకు ముందే చేతులెత్తేసిన కాంగ్రెస్ అభ్యర్థి
ఫిబ్రవరి 8న ఎన్నికల తర్వాత వెలువడిన ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఆప్ దే హవా అని తేల్చి చెప్పింది. ఇక నేడు ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే వికాస్పురి కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ శర్మ తన ఓటమిని అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతులెత్తేశారు.
ఓటమిని అంగీకరించిన వికాస్పురి కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ శర్మ
నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన శర్మ తన ఓటమిని అంగీకరిస్తూ ఆయన "నా ఓటమిని నేను అంగీకరిస్తున్నాను, వికాస్ పురి నియోజకవర్గంలోని ఓటర్లు మరియు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రాంతం యొక్క సమగ్ర అభివృద్ధి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇక నేను నా పోరాటం కొనసాగిస్తాను భవిష్యత్తులో ఢిల్లీ , వికాస్పురి మరియు ఉత్తమ్ నగర్ నియోజకవర్గాల అభివృద్ధికి కూడా తన వంతు సేవలను అందిస్తా" నని పేర్కొన్నారు .
ఢిల్లీ ఎన్నికల్లో దూకుడు మీదున్న ఆప్
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరంభం నుండే ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో దూకుడు చూపిస్తుంది. హస్తినను కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ హస్తగతం చేసుకోనుంది అనే విషయం తాజాగా కొనసాగుతున్న కౌంటింగ్ తో అర్ధం అవుతుంది. హోరాహోరీగా పోరాడిన బీజేపీ, కాంగ్రెస్ లు ఆప్ దెబ్బకు విలవిలలాడుతున్నాయి . బిజెపి 2015 కంటే మెరుగైన ఫలితాలలో 20కంటే అధిక సీట్లలో ఆధిక్యంలో ఉంది. మూడు ఉత్తర ఢిల్లీ కేంద్రాల్లో సాంకేతిక లోపాల కారణంగా కౌంటింగ్ నిలిపివేయబడింది .
Recommended Video
70 నియోజకవర్గాల్లో 21 స్థానాల్లో కౌంటింగ్ కేంద్రాలలో కొనసాగుతున్న కౌంటింగ్
ఈసారి ఢిల్లీ అసెంబ్లీకి మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, వారిలో 593 మంది పురుషులు, 79 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 62.59 శాతం ఓటింగ్ నమోదైంది, ఇది 2015 అసెంబ్లీ ఎన్నికలలో 67.49 శాతం కంటే ఐదు శాతం తక్కువ. 70 నియోజకవర్గాల్లో 21 స్థానాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. తూర్పు ఢిల్లీలోని సిడబ్ల్యుజి స్పోర్ట్స్ కాంప్లెక్స్, పశ్చిమ ఢిల్లీలోని ఎన్ఎస్ఐటి ద్వారకా, మీరాబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు ఆగ్నేయ ఢిల్లీలోని జిబి పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సర్ సివి రామన్ ఐటిఐ, సెంట్రల్ ఢిల్లీలోని ధీర్పూర్, మరియు రాజీవ్ గాంధీ స్టేడియం, ఉత్తర ఢిల్లీలోని బవానాలోని స్టేడియం లతో పాటు మరో 11 జిల్లాలలో కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి.