సంక్షేమ పథకాలే ఆప్ ను గెలిపించాయా ? విన్నింగ్ లో 'ఆప్' సీక్రెట్ మంత్ర ఇదే
ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో చీపురు ప్రత్యర్ధి పార్టీలను వూడ్చి పారేస్తుంది. ఆప్ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. స్పష్టమైన మెజార్టీతో అధికారం తిరిగి హస్తగతం చేసుకుంటుంది. అయితే ప్రత్యర్ధి పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేసినా ఆప్ కే ప్రజలు పట్టం కట్టటం వెనుక కారణం ఏంటి ? ఎందుకు ఢిల్లీ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకే మళ్ళీ జై కొట్టారు అంటే..
ఆప్ కు పట్టం కట్టిన సంక్షేమ పథకాలు
సంక్షేమ పథకాలే ఆప్ ను గెలిపించాయని , విన్నింగ్ లో ఆప్ సీక్రెట్ మంత్ర ఇదే అని చెప్పాల్సి వస్తుంది. ఢిల్లీలో సామాన్యుల కోసం వచ్చిన పార్టీగా ఆప్ మరోసారి ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకుంటుంది . ఢిల్లీలో అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆప్ విజయానికి కారణం అని చెప్పొచ్చు . ఉచిత విద్యుత్ , విద్యుత్ రాయితీలను అందించటమే కాకుండా , మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది ఆప్.
ఉచిత విద్యుత్ .. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
200 యూనిట్ల లోపు కరెంట్ వాడే వారికి ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా.. ప్రధాని మోదీతో నేరుగా తలపడటాన్ని పక్కన పెట్టి స్థానిక సమస్యలపైనే ఫోకస్ చేశారు కేజ్రీవాల్ . అవినీతి రహిత పాలన అందించడం, సంక్షేమ పథకాలు ఆమ్ ఆద్మీ పార్టీ బలం . ఇక ఈ బలమే నేడు చీపురు పార్టీ ఢిల్లీ ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకోటానికి ప్రధాన కారణంగా భావించవచ్చు.
మ్యానిఫెస్టోలోనూ సంక్షేమమే ధ్యేయం
ఇక మ్యానిఫెస్టోలో కూడా ఢిల్లీలో 24 గంటలపాటు షాపింగ్ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశామని ఆప్ తెలిపింది. నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతోపాటు ఢిల్లీవాసులకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సురక్షిత నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఢిల్లీలోని బడుల్లో ‘దేశభక్తి పాఠ్య ప్రణాళిక' అమల్లోకి తెస్తామని వాగ్దానం చేసింది. ఇంటికే రేషన్ సరుకులను సరఫరా చేయడంతోపాటు ఐదేండ్లలో పది లక్షల మంది వృద్ధులకు ఉచిత తీర్థయాత్ర సౌకర్యం కల్పిస్తామని ఆప్ హామీనిచ్చింది.
బీజేపీ ఏ ప్రకటనలు చేసినా సుపరిపాలనే ధ్యేయంగా ఆప్ విజయం
ఇటీవల ఢిల్లీలో చోటు చూసుకున్న పరిణామాలు, సీఏఏ నిరసనలు , కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉన్న వ్యతిరేకత వెరసి ఢిల్లీ పీఠం ఆప్ ఖాతాలో పడింది . ప్రధానంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా షహీన్బాగ్లో జరుగుతున్న నిరసనల్ని పదే పదే ప్రస్తావించి, వారికి మద్దతిచ్చిన వాళ్లని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది బీజేపీ .కానీ సీఎం కేజ్రీవాల్ మాత్రం తన సొంత సంక్షేమ ఎజెండాతోనే ముందుకు వెళ్లారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా అయిదేళ్లలో తాను చేసిన సుపరిపాలననే నమ్ముకుని సంయమనంతో వ్యవహరించారు. ఫలితంగా హస్తిన ఆప్ హస్తగతం అయ్యింది.