పన్నుల బారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం
Arvind Kejriwal: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేడి ప్రతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయాత్తం అయ్యాయి. హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తోన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది.
ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అదే నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల పర్వం సైతం ముగిసింది. మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ముఖ్యమంత్రి ఆతిషి సహా 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకే తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఈ ఎన్నికల బరిలో దిగారు. కల్కాజీ నుంచి ఆతిషి పోటీలో ఉన్నారు. అల్కా లంబా, పూజా బల్యాన్, రేఖా గుప్తా, పూనం శర్మ.. వంటి వివిధ పార్టీల మహిళ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మరోసారి కేంద్ర బడ్జెట్ అంశాన్ని ప్రస్తావించారు. గతంలోనూ ఆయన బడ్జెట్పై కేంద్రాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. సంవత్సరానికి 10 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న మధ్య తరగతి ప్రజలు లెక్కలేనని పన్నులను చెల్లించాల్సి వస్తోందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.
బడ్జెట్ సమర్పణ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో ఇదే విషయంపై మరోసారి మాట్లాడారు కేజ్రీవాల్. ఢిల్లీని రక్షించుకోవడానికి ఈ ఎన్నికలను ఒక ఆయుధంగా ఉపయోగంచుకోవాల్సిన అవసరం ఉందంటూ తాను గతంలో చెప్పానన, కేంద్రం ఇష్టారాజ్యంగా విధిస్తోన్న పన్నుల వల్ల ఇప్పుడు దేశ రాజధానిని మాత్రమే కాకుండా యావత్ దేశాన్నే కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు.
తన కడుపు నింపుకోవడానికి ఓ పేదవాడు ఏ నిత్యావసర వస్తువును కొన్నా.. దానికి పన్నును చెల్లించాల్సిన దుస్థితి ఈ దేశంలో నెలకొని ఉందని కేజ్రీవాల్ చెప్పారు. పన్నుల రూపంలో కేంద్రం వసూలు చేస్తోన్న లక్ష కోట్లకు పైగా నిధులు ఏమౌతున్నాయని నిలదీశారు.
పన్నుల రూపేణా అందే నిధుల కేటాయింపులో కేంద్రంలో అధికారంలో ఉండే ఏ ప్రభుత్వమైనా సాధారణంగా విద్య, వైద్యం, విద్యుత్, మంచినీటి సౌకర్యం.. వంటి మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తుంటుందని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మాత్రం తనకు అత్యంత నమ్మకస్తులైన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రుణాలను చెల్లించడానికి ఖర్చు పెడుతోందని అన్నారు. ఆ రుణాలను కేంద్రమే మాఫీ చేస్తుంటుందని గుర్తు చేశారు.
ఇవి.. ఆప్- బీజేపీ మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదని, రెండు సిద్ధాంతాల మధ్య ఏర్పడిన పోరాటమని అభివర్ణించారు కేజ్రీవాల్. ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications