Delhi Elections: గేమ్ ఛేంజర్ సీట్లు ఇవే-ఇక్కడ కొడితే హస్తిన గెలిచినట్లే..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతోంది. మరో 10 రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో తాడో పేడో తేల్చుకునేందుకు ఆప్, బీజేపీ సర్వశక్తులొడ్డుతున్నాయి. చాలా తక్కువ సీట్లతో అధికార పీఠం మారిపోయే అవకాశం ఉండటంతో ఏ రిస్క్ తీసుకునేందుకు ఇరు పార్టీలు ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో వీరికి ఓ 20 సీట్లు మాత్రం టెన్షన్ పెంచేస్తున్నాయి. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా ఢిల్లీ పీఠం ప్రత్యర్థులకు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్ర చూస్తే 18-21 సీట్లలో మెజార్టీ మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏ పార్టీ అయినా గెలిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆప్, బీజేపీకి ముఖా ముఖీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ పోటీ చేసే అభ్యర్ధుల్లో ఎవరైనా ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒకే గాలి వీస్తే అది వేరు. కానీ సాధారణ పరిస్ధితుల్లో పార్టీలకు సవాల్ విసురుతున్న ఆ గేమ్ ఛేంజర్ సీట్లలో ఏం జరుగుతుందన్న టెన్షన్ పెరుగుతోంది.

ఇలాంటి సీట్లలో పట్పర్గంజ్, త్రిలోక్పురి, ఆదర్శ్ నగర్ , విశ్వాస్ నగర్ వంటివి ఉన్నాయి. వీటిలో మళ్లీ అన్ని సమీకరణాలూ మామూలే. దీంతో ఆయా సీట్లలో గెలుపు కోసం ఆప్, బీజేపీ రెండు పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఆయా స్ధానాల్లో అభ్యర్ధుల్ని ప్రకటించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లకు హామీలతో మ్యానిఫెస్టోలు కూడా విడుదల చేసేసిన పార్టీలు.. ఇప్పుడు ఆయా సీట్లలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. వీటిలో ఎక్కడ తేడా వచ్చినా ఢిల్లీ పీఠం చేజారడం ఖాయమన్న భావన వారిలో కనిపిస్తోంది. అయితే బహిరంగంగా మాత్రం వీటిపై ఎక్కడా స్పందించడం లేదు.












Click it and Unblock the Notifications