మీవారికి చెప్పండి: షారుక్ భార్యకి కేజ్రీ ప్రభుత్వం లేఖ
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుల భార్యలకు ఢిల్లీ ప్రభుత్వం లేఖలు రాస్తోంది. నటులు షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, అర్బాజ్ ఖాన్, గోవింద్ తదితర నటుల భార్యలకు ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. వాళ్లను పాన్ మసాలా ఉత్పత్తుల ప్రకటనలలో నటించవద్దని కోరాలని అడిగింది.
మీ భర్తలు వివిధ రకాల క్యాన్సర్ కారక ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారని, వాటి వ్యాపార ప్రకటనల్లో నటించవద్దని సూచించాలని ఆ లేఖలలో కోరుతున్నారు.
ఆ లేఖలో.. తాము విజ్ఞప్తి చేస్తున్నామని, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, మీ భర్తను పాన్ మసాలా ప్రకటనల్లో నటించకుండా చూడండని షారూక్ ఖాన్ భార్య గౌరీకి ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. మిగతావారికి కూడా ఇవే తరహా లేఖలు అందాయి.
గతంలో కూడా ఇలాంటి లేఖలనే భారతీయుల్లో అమిత అభిమానమున్న మీ భర్తలకు రాసినప్పటికీ, స్పందన రాలేదని, అందువల్లే మరోసారి మీకు గుర్తు చేశామని, మీరైనా కల్పించుకుని వారి మనసు మార్చాలని ఈ లేఖలో ఉంది. ఇదిలా ఉండగా.. పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తుల ప్రకటనల్లో నటిస్తున్న సన్నీలియోన్కు గతంలో ఇలాగే లేఖను ఢిల్లీ సర్కారు రాయగా, ఆమె అప్పటి నుంచి ఈ తరహా ప్రకటనలకు దూరంగా ఉంది.