మాకు దేవుడితో సమానం: దీపావళి సందర్భంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న మోడీ గోల్డ్ బిస్కెట్స్
Recommended Video
దీపావళి పండుగకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. కొన్ని ప్రాంతాల్లో అప్పుడే పండగ సందడి కనిపిస్తోంది. ఇప్పటికే బాణాసంచాతో, పటాకులతో దీపావళి పండగ రోజు పెట్టే దీపాలతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఇక పండగవేళ ఇంట్లోకి బంగారం వస్తే అంతామంచి జరుగుతుందని నమ్మేవాళ్లు పసిడి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్నే క్యాష్ చేసుకున్నాయి కొన్ని నగల దుకాణాలు.
మోడీకి ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్న నగల దుకాణం
ఢిల్లీలో ఓ నగల దుకాణం దీపావళి సందర్భంగా తమ కస్టమర్లను వినూత్న పద్ధతిలో ఆకర్షిస్తోంది. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న క్రేజ్ను వ్యాపారం కోసం వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగానే ఆ దుకాణంలో ప్రధాని మోడీ, మాజీ ప్రధాని వాజ్పేయి ఫోటోలను బంగారం వెండి బిస్కెట్లపై ముద్రించి విక్రయిస్తోంది. దీంతో ఈ బిస్కెట్లను కూడా కొనేందుకు అంతే ఆసక్తి కనబరుస్తున్నారు కస్టమర్లు.
ప్రధాని మోడీ మాకు దేవుడితో సమానం
"దీపావళి రోజున లక్ష్మీ దేవతను వినాయకుడిని పూజిస్తాము. వీరితో పాటు మోడీని కూడా పూజిస్తాం. ఎందుకంటే మోడీ మాకు దేవుడితో సమానం. ఈ ఏడాది మోడీ ఫోటోతో ఉన్న బంగారు బిస్కెట్ను కొనుగోలు చేసి ఆయన్ను పూజిస్తాను" అని నగల దుకాణానికి వచ్చిన ఓ కస్టమర్ చెప్పాడు. అయితే ఇలా ఆ నగల దుకాణం ప్రముఖ నేతల ఫోటోలతో నగలు చేయడం తొలిసారి కాదు... అంతకు ముందు కూడా అంటే రాఖీ పర్వదినం రోజున ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీల ఫోటోలు ఉన్న బంగారు రాఖీలను తయారు చేసి అమ్మకానికి ఉంచింది. దీంతో యోగీ ఆదిత్యనాథ్ రాఖీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
మోడీ ఫోటోతో ఉన్న గోల్డ్ బిస్కెట్ల కోసం వెల్లువెత్తుతున్న ఆర్డర్లు
దీపావళి ఒక అద్భుతమైన పండుగని షాప్ యజమాని మిలాన్ చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి దేశం అభివృద్ధిపథంలో దూసుకెళ్లడమే కాదు... సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. దేశంలో విస్తృతమైన అభివృద్ధి కనిపిస్తోందని చెప్పిన మిలాన్ అందుకే మోడీ ఫోటోతో కూడిన బంగారు బిస్కెట్లను అమ్ముతున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలామంది కస్టమర్లు ఈ బిస్కెట్లను కొన్నారని ఇంకా ఆర్డర్లు వస్తున్నట్లు తెలిపారు.