ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్: అప్రూవర్గా మారిన మనీష్ సిసోడియా అనుచరుడు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అనుచరుడు ఒకరు అప్రూవర్గా మారేందుకు సిద్ధమయ్యారు. ఈ స్కాంకి సంబంధించి నిజానిజాలన్నీ బయటపెడతానని ఆ వ్యక్తి కోర్టుకు చెప్పినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియా ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. సిసోడియా దగ్గరి అనుచరులైన అమిత్ అరోఢా, దినేశ్ అరోఢా, అర్జున్ పాండేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో దినేశ్ అరోఢాకు గత వారం ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ క్రమంలో దినేశ్ అప్రూవర్గా మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీబీఐ సోమవారం కోర్టుకు తెలిపింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దినేశ్ అరోఢాను కేంద్ర ప్రభుత్వ సాక్షిగా పరిగణించాలని కోరుతూ సీబీఐ సోమవారం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దినేశ్ విచారణకు పూర్తిగా సహకరించారని, కేసుకు సంబంధించి కీలక సమాచారం ఇచ్చారని సీబీఐ తెలిపింది.
తాను స్వచ్ఛందంగా అప్రూవర్గా మారుతున్నానని, తనపై ఎవరి ఒత్తిడీ లేదని దినేశ్ స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి అన్ని నిజాలను కోర్టు ముందు బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని దినేశ్ కోర్టుకు తెలిపాడు. ఈ కేసులో తనకు క్షమాభిక్ష పెట్టాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్పై ఢిల్లీ కోర్టు నవంబర్ 14న విచారణ చేపట్టనుంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.