మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కల్లోలం: ఒక్కరోజు వ్యవధిలో అత్యధిక కేసులు నమోదు
న్యూఢిల్లీ: మహారాష్ట్రతోపాటు ఢిల్లీలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకీ భారీగా కరోనా కేసులు పెరుగుతుండటంపై రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా నిబంధనలను ప్రజలంతా తప్పకుండా పాటించాలని కోరుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఒక్కరోజే 25వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం 24,375 కరోనా కేసులు నమోదు కాగా, ఆదివారం ఆ సంఖ్య 25,462కు చేరింది. కరోనా బారినపడి 161 మంది మరణించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 29.4 శాతంగా ఉంది.
తాజా కేసులతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 8,53,460కు చేరింది. ఇప్పటి వరకు 12,121 మంది కరోనాతో మరణించారు. 7.66 లక్షల మంది ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నారు.
ఇక మహారాష్ట్రలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 68,631 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక రోజులో అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. తాజాగా, కరోనా బారినపడి 503 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరనాతో మరణించినవారి సంఖ్య 60,473కు చేరింది.
కాగా, గత 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 2.61 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1501 మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా కొత్త నమోదవుతున్న కరోనా కేసులు ఎక్కువగా పది రాష్ట్రాల్లోనే ఉంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 78.56 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 18 లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నట్లు వెల్లడించింది.