ఢిల్లీ మున్సిపల్ ఉపఎన్నికల ఫలితాలు: బీజేపీ ఆధిపత్యం, కాంగ్రెస్ ఖాతా ఓపెన్!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లోని 12 వార్డులకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీజేపీ ఈ ఉపఎన్నికల్లో మొత్తం 12 సీట్లలో 7 సీట్లను గెలుచుకుని తమ పట్టును కొనసాగించింది. అధికారంలో ఉన్న దశాబ్ధం తర్వాత కేవలం 10 నెలల క్రితం అధికారం కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ 3 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఢిల్లీ ఎన్నికల్లో ఎలాంటి ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓ సీటు దక్కింది. మిగిలిన ఒక సీటును ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది.
వ్యూహాత్మకంగా చూస్తే.. ఈ ఉపఎన్నికల ఫలితాలు బీజేపీకి పూర్తిగా అనుకూలంగా లేవు. ఎందుకంటే ఉపఎన్నికలకు ముందు బీజేపీ ఖాతాలో 9 సీట్లు ఉండగా, ఈసారి ఒక సీటును కాంగ్రెస్కు మరొక సీటును AIFBకి కోల్పోయింది. అయితే 2022 పూర్తి ఎన్నికల్లో ఆప్ గెలుచుకున్న చాందినీ చౌక్ వార్డును బీజేపీ అభ్యర్థి సుమన్ గుప్తా గెలుచుకోవడంతో ఒక సీటును ఆప్ నుంచి చేజిక్కించుకుంది. దీనికి బదులుగా 2022లో బీజేపీ గెలిచిన నరైనా వార్డును ఆప్ తిరిగి గెలుచుకుంది. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లను కోల్పోయినప్పటికీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD)లో దాని నియంత్రణపై ఎటువంటి ప్రభావం చూపదు. తాజా ఫలితాల తర్వాత 250 సీట్లు ఉన్న MCDలో బీజేపీకి 122 సీట్లు, ఆప్కు 102 సీట్లు, కాంగ్రెస్కు 9 సీట్లు ఉన్నాయి.

ఈ ఉపఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఆప్ ఢిల్లీ యూనిట్ ఇంచార్జి సౌరభ్ భరద్వాజ్ ఇద్దరికీ తొలి ఎన్నికల పరీక్షగా నిలిచాయి. బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా, ఈ ఉపఎన్నికల పరీక్షలో సులభంగా విజయం సాధించినట్లు స్పష్టమైంది. ఆమె గతంలో ప్రాతినిధ్యం వహించిన షాలిమార్ బాగ్ B వార్డును బీజేపీ తరపున అనితా జైన్ నిలబెట్టుకోవడం ఆమె నాయకత్వానికి అనుకూలంగా ఉంది. మరోవైపు, ఆప్ ఢిల్లీ యూనిట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సౌరభ్ భరద్వాజ్కు కూడా ఇది మొదటి ఎన్నిక. ఆయన ఈ ఉపఎన్నికల్లో ఒక్క సీటు కూడా కోల్పోకుండా, ఓడిపోయిన సీట్లను తిరిగి గెలుచుకోగలిగారు, కాబట్టి ఆయన కూడా ఈ ఫలితాలను తన విజయంగా చెప్పుకోనున్నారు.
విజేతల స్పందనలను పరిశీలిస్తే సంగం విహార్ A వార్డులో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ చౌదరి, "ముఖ్యమంత్రితో సహా చాలా మంది బీజేపీ నాయకులు ఇక్కడ ప్రచారం చేసినప్పటికీ, వారు చేసిన పనుల ఆధారంగా ఓట్లు అడగలేదు, అందుకే వారు గెలవలేకపోయారు. ఈ విజయం సంగం విహార్ ప్రజలకే దక్కుతుంది" అని అన్నారు. అదేవిధంగా దక్షిణ్పురి నుంచి గెలిచిన ఆప్ అభ్యర్థి రామ్ స్వరూప్ కనోజియా, "ఈ విజయం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్యే ప్రేమ్ చౌహాన్, ప్రజలకే దక్కుతుంది" అని తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.












Click it and Unblock the Notifications