క్రైం సిండికేట్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు
మేనల్లుడి నాయకత్వంలో ఉన్న క్రైం సిండికేట్ లో మెంబర్ గా ఉన్నమాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాంబీర్ షోకీన్ను మోకా చట్టం కింద అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: మేనల్లుడి కోసం అనేక నేరాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మేనల్లుడి నాయకత్వంలో ఉన్న క్రైం సిండికేట్ లో మెంబర్ గా ఉన్నమాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాంబీర్ షోకీన్ను మోకా చట్టం కింద అరెస్టు చేశారు.
ఢిల్లీలోని ముండ్యా నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే అయిన రాంబీర్ షోకీన్ను ఎవరైనా పట్టుకుంటే అక్షరాల లక్ష రూపాయలు ఇస్తామని ఢిల్లీ పోలీసులు ఇటీవలే ప్రకటించారు. ఈ కాంగ్రెస్ నాయకుడు మరో నిందితుడితో గొడవ పడుతుంటే మాకు చిక్కాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఇంతకుముందే రాంబీర్ షోకిన్ కు తన మేనల్లుడు నీరజ్ బవానా నాయకత్వంలో నడుస్తున్న క్రైం సిండికేట్లో కూడా భాగస్వామ్యం ఉందని చార్జిషీటు దాఖలైంది. తరచూ నేరాలకు పాల్పడతాడని ప్రకటించిన ఆ కాంగ్రెస్ నాయకుడు రాంబీర్ షోకీన్ను ఢిల్లీ శివార్లలోని కరాలా ప్రాంతంలో గల రామా విహార్ ఏరియాలో అరెస్టు చేశామని ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ కుమార్ కుష్వాహ చెప్పారు.
నీరజ్ బవానా, రాంబీర్ షోకీన్లతో పాటు నీరజ్ బవానా సోదరుడు పంకజ్ సెహ్రావత్పై కూడా చార్జిషీటు దాఖలైంది. వీళ్లే కాక క్రైం సిండికేట్లోని ఇతర సభ్యులు సునీల్ రాఠీ, అమీత్ మాలిక్, నవీన్ దబాస్, రాహుల్ దబాస్, నవీన్ హూడా, దీపక్ దబాస్, గుర్ ప్రీత్సింగ్లను ఇప్పటివరకు అరెస్టు చేశామని పోలీసు అధికారులు వివరించారు.
2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాంబీర్ షోకిన్ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపోందారు. తరువాత తన దందాలు, స్కాంలు విచ్చలవిడిగా చేశాడు. అనంతరం కొందరు పెద్దలు సలహాలతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2015 ఆగస్టు 26న రాంబీర్ షోకిన్ నేరస్తుడని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. అప్పటి నుంచి అతను తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరికి పోలీసులు రాంబీర్ షోకిన్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.