కాల్పుల కలకలం: పోలీసులపై దండగులు బుల్లెట్ల వర్షం: హైఅలర్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని కాల్పుల కలకలం చోటు చేసుకుంది. తనిఖీలను నిర్వహిస్తోన్న పోలీసులపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన అతణ్ని సమీప ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు తెగబడిన దుండగుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తోన్నారు. కాల్పులు జరిపిన వెంటనే వారు ఢిల్లీ విడిచి వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు.
భారత్ బంద్ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు విస్తృత తనిఖీలను నిర్వహిస్తోన్నారు. ఈ సందర్భంగా భల్స్వా డెయిరీ, జేజే కాలనీ చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను సోదా చేసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బైక్పై వెళ్తోన్న ముగ్గురు వ్యక్తులను ఆపి, వారి పత్రాలను చూపించాల్సిందిగా అడగ్గా వారు తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సందీప్ అనే కానిస్టేబుల్ వారిని వెంటాడారు. దీనితో వారు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు.
ఈ కాల్పుల్లో సందీప్కు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను వెంటనే షాలిమార్ బాగ్ ప్రాంతంలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వారు ప్రయాణిస్తోన్న బైక్.. చోరీకి గురై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. దానికి సంబంధించిన పత్రాలేవీ వారి వద్ద ఉండకపోవచ్చని, అందుకే తనిఖీల సందర్భంగా తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించారని అనుమానిస్తున్నారు.
ఈ సంఘటన చోటు చేసుకున్న వెంటనే ఆయా ప్రాంతాల్లో హైఅలర్ట్ను ప్రకటించారు పోలీసులు. అసాంఘిక శక్తులతో వారికి లింకులు ఉండొచ్చనే కోణలోనూ దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన అనంతరం వారు ఢిల్లీ దాటి బయటికి వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సరిహద్దుల్లో పోలీసులను అప్రమత్తం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకోవాలంటూ ఆదేశాలను జారీ చేశారు.