పర్మిషన్ లేదు, వస్తే తాట తీస్తాం: పోలీసుల సీరియస్ వార్నింగ్
రిజర్వేషన్ల వ్యవస్థను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ ధర్నాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, నిరసన ప్రదర్శనల పేరిట ఎవరూ ఢిల్లీకి రావద్దని న్యూఢిల్లీ డీసీపీ స్పష్టం చేశారు. ఆగస్టు 23న జంతర్ మంతర్ వద్దకు రావాలని కొందరు నెటిజన్లు పెడుతున్న పోస్టులను నమ్మవద్దని, ఎలాంటి ఆధారాలు లేని సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయడం లేదా ఫార్వర్డ్ చేయడం చేయకూడదని పౌరులకు విజ్ఞప్తి చేశారు.
జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (గతంలో సెక్షన్ 144) కింద కఠిన నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని పోలీసులు గుర్తుచేశారు. దీనిప్రకారం ఎలాంటి ర్యాలీలు, సభలు, ప్రదర్శనలతో పాటు ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడటం చట్టవిరుద్ధమని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

కులాధారిత రిజర్వేషన్లపై నిరసనల పర్వం
కాగా, గత శుక్రవారం 'రిజర్వేషన్ హటావో ఆందోళన్' బ్యానర్ కింద పెద్ద సంఖ్యలో నిరసనకారులు జంతర్ మంతర్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఈ ఆంక్షలు తెరపైకి వచ్చాయి. కుల ప్రాతిపదికన కాకుండా కేవలం ఆర్థిక పరిస్థితి ఆధారంగానే విద్యా, ఉద్యోగాల్లో కోటాలను నిర్ణయించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. "ఒకే కుటుంబానికి ఒకే రిజర్వేషన్" విధానాన్ని అమలు చేయాలని, అలాగే యూజీసీ ఇటీవల తీసుకొచ్చిన నిబంధనలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు ఒత్తిడి తెస్తున్నారు.
మోహరించిన బలగాలు: సోషల్ మీడియాపై నిఘా
ఈ ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలను భారీగా మోహరించారు. 'రిజర్వేషన్ హటావో ఆందోళన్' పేరిట ఇన్స్టాగ్రామ్లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న పేజీల ద్వారా ఈ పిలుపు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరసన స్థలంలో ముందస్తు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఫేక్ వార్తలతో ప్రజలను రెచ్చగొట్టే యత్నాలను అడ్డుకోవడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.














Click it and Unblock the Notifications