ఖరీదైన ఫోన్ల చోరీ కేసు: ఫ్లిప్కార్ట్కు పోలీసుల నోటీసు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు సోమవారం నాడు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు నోటీసులు పంపించింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో నుంచి దొంగిలించబడి, ఆపై రికవరీ అయిన కోటి రూపాయల విలువైన ఫోన్లను ఆన్లైన్ మాధ్యమంగా విక్రయించిన కేసులో తమ విచారణకు సహకరించాలని ఢిల్లీ పోలీసులు ఫ్లిప్కార్ట్కు నోటీసులు ఇచ్చారు.
ఆరుగురు వ్యక్తులు విమానాశ్రయం సరకు రవాణా కేంద్రం నుంచి దొంగిలించారు. వీటిలో 22 ఫోన్లను మైసూర్, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, ఢిల్లీ, చండీగఢ్ ప్రాంతాల నుంచి రికవరీ చేశామని తెలిపారు.
హాంకాంగ్ నుంచి వచ్చిన పార్సిళ్లలో 600కు పైగా హైఎండ్ మొబైల్ ఫోన్లు దొంగిలించబడ్డాయని ఢిల్లీకి చెందిన ఒక లాజిస్టిక్స్ సంస్థ జూలైలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును విచారించారు. ఈ కేసులో కార్గో ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని తెలుసుకున్నారు.
ఈ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోకుండా ఎలా విక్రయించారంటూ ఫ్లిప్కార్ట్కు నోటీసులు పంపినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇవి రాజస్థాన్ కేంద్రంగా ఉన్న ఓ ఏజంటు ద్వారా అమ్మకాలు జరిగాయని ఫ్లిప్కార్ట్ ప్రతినిధి తెలిపారు.
కాగా, ఈ నోటీసును కంపెనీ సీఈవో పేరు మీద పంపించామని, దొంగిలించిన మొబైల్ ఫోన్స్ను సదరు వెబ్ సైట్ ద్వారా అమ్మారని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డిసిపి దినేష్ కుమార్ గుప్తా చెప్పారు. నిందితులు తాము దొంగిలించిన ఫోన్లను ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మారని తెలిపారు.
209 ఫోన్లను రికవరీ చేసినట్లు చెప్పారు. కాగా, మొబైల్ ఫోన్స్ దొంగిలించిన కేసులో రాజు, సునీల్, గౌరవ్, జితేందర్, హరేందర్, రవిలు నిందితులుగా ఉన్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి, 209 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు.